‘రాష్ట్రపత్ని’ వివాదం: కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరిపై ఎఫ్ఐఆర్ నమోదు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అధిర్ రంజన్ చౌదరి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తలు ఫిర్యాదు ఫిర్యాదు చేయడంతో మధ్యప్రదేశ్ పోలీసులు గురువారం ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
అధిర్ రంజన్ చౌదరిపై ఎఫ్ఐఆర్ ఇండియన్ పీనల్ కోర్ట్ (IPC) సెక్షన్లు 153B, 505(2) కింద నమోదు చేయబడింది. ఈ కేసును ఢిల్లీకి పంపబడిందని దిండోరీ ఏఎస్పీ జగన్నాథ్ మార్కం ఏఎన్ఐకి వెల్లడించారు.
మరోవైపు, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముని 'రాష్ట్రపత్ని' అని సంబోధించినందుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని, వ్రాతపూర్వక వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరికి జాతీయ మహిళా కమిషన్ నోటీసు జారీ చేసింది.
ఎన్సిడబ్ల్యు, 13 రాష్ట్ర మహిళా కమీషన్లు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. చౌదరి వ్యాఖ్య "తీవ్రమైన అవమానకరమైనది, సెక్సిస్ట్, గౌరవనీయులైన రాష్ట్రపతిని కించపరిచే ప్రయత్నం" అని పేర్కొన్నాయి.
భారతదేశపు మొట్టమొదటి గిరిజన రాష్ట్రపతిని 'రాష్ట్రపత్ని'గా ప్రస్తావిస్తూ చౌదరి ఇటీవల చేసిన వ్యాఖ్యలు.. బీజేపీ, కాంగ్రెస్ల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఫలితంగా రెండు జాతీయ పార్టీలు భారీ నిరసనలకు దిగాయి.
కాగా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేయగా, మరోవైపు కాంగ్రెస్ పార్టీ పెద్ద పాత పార్టీ అధినేత్రిని ఈ వ్యవహారంలోకి లాగినందుకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ క్షమాపణలు చెప్పాలని కోరింది.
Madhya Pradesh | A complaint letter was presented by BJP workers against Congress leader Adhir Ranjan Chowdhury for making insulting remarks towards President Droupadi Murmu. FIR filed in the matter under IPC sec 153B, 505(2) & being sent to Delhi: Jagannath Markam, ASP, Dindori pic.twitter.com/hZpN9cGDZq
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 28, 2022
తన డిఫెన్స్లో, లోక్సభలో కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న చౌదరి.. భారత రాష్ట్రపతిని అగౌరవపరచాలని తాను ఎప్పుడూ అనుకోలేదని, 'రాష్ట్రపత్ని' వ్యాఖ్య తన "నాలుక పొరపాటు" అని అన్నారు. రాష్ట్రపతి ముర్ముకి క్షమాపణ చెప్పడానికి కూడా అతను అంగీకరించారు. దీనిపై బీజేపీ రాద్దాంతం చేస్తోందని మండిపడ్డారు.
అంతేకాకుండా, రేపటి రోజు తాను రాష్ట్రపతిని సమయం కోరానని, తన అనాలోచిత వ్యాఖ్యల వల్ల ఆమె బాధపడి ఉంటే ఆమెకు క్షమాపణలు చెబుతానని చౌదరి చెప్పారు.
ఇదిలావుండగా, అధికార బీజేపీ గురువారం కాంగ్రెస్పై తీవ్ర దాడిని ప్రారంభించింది. ఉద్దేశపూర్వకంగానే రంజన్ చౌదరి రాష్ట్రపతిని అవమానించారని, అది ముర్ము, ఆమె కార్యాలయాన్ని కించపరిచేలా, భారతదేశ విలువలకు విరుద్ధమని కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, స్మృతీ ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో సోనియా గాంధీకి, స్మృతీ ఇరానీకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నాతో మాట్లాడకు అంటూ సోనియా గాంధీ.. స్మృతీ ఇరానీపై గట్టిగా అన్నారు. దీంతో సోనియా తీరుపై నిర్మలా సీతారామన్ మండిపడ్డారు.