నోరు జారాను, క్షమించండి: రాష్ట్రపతి ముర్ముకు అధిర్ రంజన్ చౌదరి
న్యూఢిల్లీ: అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు క్షమాపణలు చెప్పారు లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత. ఆమెను రాష్ట్రపత్ని అనడం రాజకీయంగా దుమారం రేపిన నేపథ్యంలో ఈ మేరకు ఆయన లేఖ రాశారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకులు ఆయన చేసిన 'రాష్ట్రపత్ని' వ్యాఖ్యపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.
లోక్సభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి క్షమాపణలు చెప్పారు. రంజన్ చౌదరి ప్రెసిడెంట్ ముర్ముకి లేఖ రాశారు. ఆ లేఖలో ముర్మును తన క్షమాపణను అంగీకరించాలని అభ్యర్థించారు. "మీరు కలిగి ఉన్న పదవిని వివరించడానికి పొరపాటున తప్పు పదాన్ని ఉపయోగించినందుకు చింతిస్తున్నాను" అని లేఖలో పేర్కొన్నారు.
పొరపాటున నోరు జారాను అని కాంగ్రెస్ సీనియర్ లేఖలో కూడా పునరుద్ఘాటించారు. "ఇది స్లిప్ ఆఫ్ టంగ్ అని నేను మీకు హామీ ఇస్తున్నాను. నేను క్షమాపణలు కోరుతున్నాను, దానిని అంగీకరించమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను" అని లేఖలో తెలిపారు.
తరువాత తన వ్యాఖ్యలపై నిరసనలు, తీవ్ర ప్రతిస్పందనపై చౌదరి స్పందిస్తూ.. బిజెపి నన్ను ఉగ్రవాదిగా పేర్కొంటుందని, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ) కింద నన్ను అరెస్టు చేస్తుందని తాను ఎదురుచూస్తున్నానని చౌదరి అన్నారు.
"గిరిజనులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ దేశంలో జరుగుతున్న కొన్ని హత్యలకు వెనుక కారణాలను కప్పిపుచ్చుతున్నారు. సోనియా గాంధీ హయాంలో రూపొందించిన చట్టాలను మార్చేస్తున్నారు. గిరిజనులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు" అని అధీర్ వ్యాఖ్యానించారు.
ఇటీవల అధీర్ రంజన్ చౌదరి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఉద్దేశిస్తూ 'రాష్ట్రపత్ని' అనే పదం వాడటం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ విషయంపై పార్లమెంటులో దుమారం చేలరేగింది. ముర్ముపై చేసిన వ్యాఖ్యలకు అధీర్ క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై తీవ్ర విమర్శలు చేయడం సభలో గందరగోళానికి దారి తీసింది. కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. సోనియాకు స్మృతీ ఇరానీ క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేశాయి. ఈ కారణంతోనే శుక్రవారం ఉభయసభలకు అంతరాయం కలిగింది. సోమవారానికి వాయిదా పడ్డాయి.