నోట్లతో రాళ్ల వర్షం ఆగింది: పారికర్, మంచిరోజులకు ఇవే ప్రూఫ్: చిద్దూ
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందకపోవడంతో ఉగ్రవాద చర్యలు తగ్గుముఖం పట్టాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ చెప్పారు. ప్రత్యేకించి కాశ్మీరు లోయలో నిత్యం భద్రతా దళాల పైన రాళ్లు రువ్వే ముఠాల విషయమై ఆయన ప్రస్తావించారు.
రూ. 500 ఇస్తే రాళ్లు రువ్వడం రూ.1000 ఇస్తే మరిన్ని విద్రోహచర్యలకు దేశ వ్యతిరేక శక్తులు పాల్పడేవారన్నారు. అయితే పెద్దనోట్ల రద్దుతో ఈ ముష్కర మూకలకు ఎటువంటి డబ్బులు అందడం లేదన్నారు. దీంతో రాళ్లు రువ్వే ముఠాలు కూడా మౌనంగా ఉన్నాయన్నారు.
పెద్ద నోట్లను రద్దుచేసి సాహసోపేత నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని తీసుకున్న నిర్ణయం కొన్ని రాజకీయపక్షాలకు మింగుడుపడటం లేదన్నారు. ఎన్నికల సమయంలో అనైతికంగా పంచే డబ్బు పంపిణీకి కూడా కళ్లెం పడుతుందన్నారు. పాకిస్తాన్ పైన సర్జికల్ స్ట్రయిక్స్తో పాటు దేశ ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టేందుకు మోడీ తీసుకున్న నిర్ణయాలు తిరుగులేనివన్నారు.
అర్థరహితం: వెంకయ్య
పెద్ద నోట్ల రద్దుపై ప్రతిపక్షాల విమర్శలు అర్థరహితమని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. నల్లధనాన్ని వెలికితీసేందుకు మోడీ చేస్తున్న ప్రయత్నాన్ని విమర్శించడం సరికాదన్నారు. సామాన్యులకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే మోడీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారన్నారు.
మంచిరోజులకు ఇంతకన్నా ప్రూఫ్ కావాలా: చిదంబరం
ప్రధాని మోడీ తాను అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి రోజులు వస్తాయని హామీ ఇచ్చారని, కానీ పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకులు ముష్టివేసే డబ్బుల కోసం ప్రజలు పడిగాపులు కాస్తున్నారని, మంచిరోజులకు ఇంతకన్నా ఏం రుజువు కావాలని కాంగ్రెస్ నేత చిదంబరం ఎద్దేవా చేశారు.