బెదిరింపులు: ప్రముఖ నటుడు, ఎంపీ రవికిషన్కు వై ప్లస్ భద్రత, యూపీ సర్కారుపై విమర్శలు
లక్నో: దేశంలో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోతోందని.. యువతను తప్పుడు మార్గంలో నడిపించే కుట్ర జరుగుతోందని బీజేపీ ఎంపీ, ప్రముఖ సినీ నటుడు రవికిషన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు డ్రగ్స్ మాఫియా నుంచి బెదిరింపులు ఎక్కువయ్యాయి. దీంతో తనకు భద్రతా పెంచాలంటూ ప్రభుత్వాన్ని కోరారు రవికిషన్.
ఈ క్రమంలోనే రవికిషన్కు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ భద్రతను కల్పించింది. ఆయనకు వై ప్లస్ కేటగిరీ భద్రతను కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా, తనకు వై ప్లస్ కేటగరిీ భద్రతను కల్పించడం పట్ల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు రవికిషన్ ధన్యవాదాలు తెలిపారు.
కాగా, హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు కీలక మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రియా చక్రవర్తిని విచారిస్తున్నారు పోలీసులు. ఇక పలువురు బాలీవుడ్ హీరోయిన్లను ఇప్పటికే డ్రగ్స్ నియంత్రణ అధికారులు(నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో-ఎన్సీబీ) విచారించిన విషయిం తెలిసిందే.
ఇది ఇలావుంటే, రవికిషన్కు భద్రతను పెంచడంపై విపక్షాలు మండిపడుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యువతులకు రక్షణ కల్పించలేకపోతున్న ప్రభుత్వం.. ప్రముఖులకు మాత్రం రక్షణ కల్పిస్తోందంటూ విమర్శిస్తున్నారు. ఇటీవల యూపీలో వరుస అత్యాచార ఘటనలు జరుగుతుండటంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.