బీజేపీ ప్లేట్ ఫిరాయింపు: హోదా తెస్తామంటున్న ఆప్
పనాజీ: దేశంలోనే ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశం, కోస్తా తీర రాష్ట్రం గోవాలో అధికార బిజెపి, ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీతోపాటు తొలిసారి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) రంగ ప్రవేశం చేసింది. దీంతో త్రిముఖ పోటీగా మారింది. ఫిబ్రవరి నాలుగో తేదీన జరిగే ఎన్నికల్లో గెలుపొందేందుకు మూడు పార్టీలు హోరాహోరీ పోరాడుతున్నాయి.
అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామన్న హామీతో 2012లో అధికారంలోకి వచ్చిన బీజేపీ తర్వాత మాట మార్చింది. 2014 వరకు సీఎంగా పనిచేసిన మనోహర్ పారికర్ కేంద్ర రక్షణ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఫ్లేట్ ఫిరాయించారు. అన్ని రంగాల్లోనూ ప్రగతి పథంలో ముందుకు సాగుతున్ గోవాకు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశమే లేదని 2016 నవంబర్ లో తేల్చేయడంతో గోవా వాసులు బిజెపి పట్ల, కమలనాథుల పట్ల వ్యతిరేకత చూపుతున్నారు. తాజాగా తొలిసారి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరంలో బరిలో నిలిచిన ఆప్ తమను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధించి చూపుతామని మరోసారి హామీనిస్తున్నది. ఇదే అంశం బీజేపీకి మింగుడుపడని అంశంగా మారింది.
ఆప్ సీఎం అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి ఎల్విస్ గోమ్స్ రాష్ట్ర ప్రజలందరికి సుపరిచుతుడే. కానీ అధికార బిజెపి మాత్రం సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల గోదాలోకి దూకింది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థులకు కొదవలేదు. ప్రస్తుత అసెంబ్లీలో విపక్ష నేతతోపాటు మొత్తం నలుగురు మాజీ సీఎంలు గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
కాగా మార్పు సాధిస్తామన్న నినాదంతో ఆప్ గోవా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నది. 'గోవా మార్పును కోరుకుంటోంది. ఆ మార్పే ఆప్' అని పేర్కొంటూ బీజేపీ, కాంగ్రెస్ లాంటి ప్రధాన పార్టీలతో పోటీ పడుతూ వీధి వీధిన పోస్టర్లను అతికించడంతోపాటు పెద్ద పెద్ద హోర్డింగ్లను కూడా ఏర్పాటు చేసింది. కొంకణి భాషలో ఎన్నికల పాటలను ప్రతి కూడలిలో వినిపిస్తూ గల్లిగల్లీలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం సాగిస్తున్నది.
ఫోన్లు, సోషల్ మీడియా ద్వారా కూడా కూడా విస్తృత ప్రచారం సాగిస్తోంది. అధికారంలో ఉన్న ఢిల్లీ నుంచే కాక కర్ణాటకలోని బెంగళూరు నుంచి 500 మంది , ఉత్తరాఖండ్ నుంచి ఆప్ కార్యకర్తలు వచ్చి గోవాలో ప్రచారం సాగిస్తున్నారు. ఆమెరికాలోని ఆప్ శాఖ కార్యకర్తలు కొందరు గోవా వచ్చి ప్రత్యక్షంగా ప్రచారం చేస్తుండగా, ఎక్కువ మంది అక్కడి నుంచి గోవాలోని 3.8 లక్షల ఫోన్లకు ఆప్ తరఫున ఫోన్ల ద్వారా ప్రచారం సాగిస్తున్నారు. బెంగళూరు నుంచి వచ్చిన కార్యకర్తలు కర్ణాటక నుంచి వలస వచ్చిన ఓటర్లపై కేంద్రీకరించారు.
గోవా ప్రత్యేక గుర్తింపును పరిరక్షిస్తాం
గోవాను సింగపూర్గా మారుస్తామని, ఫ్రీవేలు, స్కైవేలు, క్యాసినోలు ఏర్పాటు చేస్తామని బీజేపీ హామీల వర్షం కురిపిస్తుంటే , గోవాకు గల ప్రత్యేక గుర్తింపును, సాంస్కృతిక వారసత్వపు సంపదను పరిరక్షిస్తామన్న నినాదంతో ఆప్ ఎన్నికల ప్రచారంలోకి దిగింది. ఆప్ అభ్యర్థులు తమ తమ నియోజక వర్గాల్లో ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని హామీలు ఇస్తున్నారు.
బీజేపీ ఇప్పటికే ప్రవేశపెట్టిన ఉచిత ఆకర్షణ పథకాలను కొనసాగిస్తామని, నిరుద్యోగులకు నెలకు రూ.5000 భృతి కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో మైనింగ్ కార్యకలాపాలను క్రమబద్దీకరిస్తామని చెప్పింది. రాష్ట్రంలోని 40 అసెంబ్లీ సీట్లకు ఆప్ తరఫున 39 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. సీఎం అభ్యర్థిగా మాజీ ఐపీఎస్.. క్రిష్టియన్ ఎల్విస్ గోమ్స్ తలపడుతున్నారు.
రాష్ట్రంలో 27 శాతం క్రైస్తవుల ఓట్లు ఉన్నాయి. ఆప్ అభ్యర్థులందరూ రాజకీయాలకు కొత్తే. వారికి రాజకీయపరమైన ఎలాంటి అనుభవం లేదు. ఢిల్లీ సీఎంఅరవింద కేజ్రివాల్ ఎన్నికల ప్రచార సభల్లో, మీడియా ఇంటర్వ్యూలో తరుచుగా ప్రస్తావిస్తున్నారు. రాజకీయ అనుభవం లేకపోయినా, అవినీతి చరిత్రలేని వారినే తాము రంగంలోకి దించామని చెప్తున్నారు. ఎన్నికయ్యాక తమ ఎమ్మెల్యేలు ఎలాంటి తప్పు చేసినా వారిని పార్టీ కఠినంగా శిక్షిస్తుందని హామీ కూడా ఇస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలను పరస్పరం ఎన్నుకునే సంస్కృతిని ఇకనైనా వదులుకోవాలని, గోవా సంస్కృతి పరిరక్షణకు ఆప్ను గెలిపించాలని ఆయన కోరారు. బిజెపి నుంచి 36 మంది, కాంగ్రెస్ పార్టీ తరఫున 38 మంది పోటీ చేస్తున్నారు. ఇక మహారాష్ట్ర వాది గోమంతక్ పార్టీ, గోవా సురక్షా మంచ్, శివసేన కూటమి 35 సీట్లకు పోటీ చేస్తోంది.
గోవాలో గెలుపెవరది?
తొలిసారి ఆప్ పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ ఓట్లు చీలిపోయి తమకు లబ్ధి చేకూరుతోందని తామే విజయం సాధిస్తామని అధికార బీజేపీ వాదిస్తోంది. ఇప్పుడు బీజేపీ, గతంలో కాంగ్రెస్తో విసిగిపోయిన గోవా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, మొదట్లో రెండు సీట్లు కూడా రావన్నవారే ఖాయంగా 12 సీట్లు వస్తాయని ఇప్పుడు చెబుతున్నారని, దీనర్థం తమ గెలుపు ఖాయమని ఆప్ వర్గాలు చెబుతున్నాయి. ఆప్కు రోజురోజుకు మద్దతు పెరుగుతోందని, ఈ కారణంగా ఆప్ గెలిచే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఎన్నికల ముందు వరకు బిజెపితో ప్రభుత్వంలో కలిసి కొనసాగిన మహారాష్ట్ర వాదీ గోమంతక్ పార్టీ బయటకు వెళ్లడం, ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించినందుకు ఆర్ఎస్ఎస్ గోవాశాఖ చీఫ్ ను సంస్థ నుంచి తొలగించడం వంటి చర్యలతో అధికార బిజెపి బలహీన పడింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలప్రచారంలో బిజెపి అధ్యక్షుడు అమిత్ షా మళ్లీ పార్టీని గెలిపిస్తే రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సీఎం అవుతారనే నినాదాన్ని ముందుకు తెచ్చారు. రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కూడా పార్టీ నిర్ణయమే తనకు శిరోధార్యమని కూడా ప్రకటించడంతో గోవాలో అధికార బిజెపి ఆత్మరక్షణలో పడిందని అర్థమవుతూనే ఉన్నది.
అధికారం కోసం కాంగ్రెస్ పాట్లు
గోవాలో తిరిగి అధికారం సంపాదించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పాట్లు పడుతున్నది. 2012 ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి బయట పడేందుకు నానా సమస్యలు ఎదుర్కొంటున్నది. చివరి క్షణంలో పొత్తులకు నిరాకరించిన కాంగ్రెస్ పార్టీ ఒకటి, రెండు సీట్లలో సర్దుబాటుకు అంగీకరించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన అంటానాసియో మోన్సెర్రాట్టె.. పనాజీ నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే రోహన్ ఖౌంటే.. పోర్వోరిం పోటీలో ఉన్నారు.
వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై పోటీచేయడంలేదు. అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందిస్తామన్న హామీతో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోంది. బీజేపీ హయాంలో అన్ని విధాల గోవా వెనుకబడిందని ఎఐసీసీ కార్యదర్శి గిరిష్ చోదాంకర్ తెలిపారు. కొత్త, పాతతరం నేతలతో ఎన్నికల బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల నుంచి మద్దతు సంపాదించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నది.
తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రజలందరి ఆకాంక్షలకు చోటు కల్పించామని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. కాసినోలపై నిషేధం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విద్యార్థులకు ఉఛితంగా ఐదు లీటర్ల పెట్రోల్, ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు పునరుద్ధరణ తదితర అంశాలపై హామీనిస్తున్నది. మాజీ సీఎంలు లుజిన్హో ఫాలైరో, ప్రతాప్ సింగ్ రాణె, దిగంబర్ కామత్ తదితరుల మధ్య పోటీ నేపథ్యంలో పార్టీ నాయకత్వం సీఎం అభ్యర్థిగా ఎవరి పేరూ ప్రకటించలేదు.