కాశ్మీర్కు మళ్లీ రాష్ట్ర హోదా- అసెంబ్లీ ఎన్నికలు: కేంద్రం సంచలనం
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్లపై విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. కాశ్మీర్లో ఎన్నికలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
ఆర్టికల్ 370 రద్దు అత్యంత సున్నితమైన, సమస్యాత్మక అంశం కావడం వల్ల వీటిపై విచారణ చేపట్టడానికి సుప్రీంకోర్టు- ప్రత్యేకంగా రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయిదు మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్లను విచారిస్తోంది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యాన్ని వహించే ఈ ధర్మాసనంలో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు. 2020లో పలు పిటీషన్లు దాఖలైన విషయం తెలిసిందే. సుమారు 23 పిటీషన్లు దాఖలయ్యాయి.
2020లో అవి దాఖలైనప్పటికీ.. లిస్టింగ్ కాలేదు. వాటిపై విచారణ చేపట్టడానికి సుప్రీంకోర్టు పెద్దగా ఆసక్తి చూపలేదు. 2020 మార్చిలో చివరిసారిగా ఈ పిటీషన్లు లిస్ట్ అయ్యాయి గానీ బెంచ్ మీదికి విచారణకు రాలేదు. ఇటీవలే వాటిని విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. ప్రత్యేకంగా రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది.
ఆర్టికల్ 370 రద్దయిన ఇన్ని సంవత్సరాల తరువాత సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలను జారీ చేస్తుంది?, పిటీషన్లపై విచారణ సందర్భంగా ఎలాంటి వాదనలు వెలువడతాయనేది ఆసక్తి రేపుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

కేంద్రం తరఫున తుషార్ మెహతా తన వాదనలను వినిపించారు. మొత్తంగా మూడు ఎన్నికలను జమ్మూ కాశ్మీర్లో నిర్వహించాల్సి ఉందని అన్నారు. ముందుగా పంచాయతీ రాజ్కు ఎన్నికలను చేపట్టాల్సి ఉందని వివరించారు. దాని మున్సిపాలిటీలు, అనంతరం అసెంబ్లీకి ఎన్నికల ప్రక్రియ చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడానికి నిర్దిష్ట కాలపరిమితిని ఇవ్వలేమని తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తేల్చి చెప్పారు. కేంద్ర పాలిత హోదా మాత్రం తాత్కాలికమేనని, సంపూర్ణ రాష్ట్రంగా జమ్మూ కాశ్మీర్ను అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రక్రియను కొనసాగిస్తోన్నామని అన్నారు.
2018 నుంచి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు 45.2 శాతం, సరిహద్దు చొరబాట్లు 90 శాతం మేర తగ్గాయని తుషార్ మెహతా తెలిపారు. రాళ్లదాడులు వంటి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితులు ఇప్పుడక్కడ లేవని, 97 శాతం వరకు తగ్గాయని అన్నారు. 2018లో రాళ్లు రువ్విన కేసులు 1,767గా నమోదు కాగా.. 2023లో అలాంటి ఒక్క కేసూ లేదని వివరించారు.












Click it and Unblock the Notifications