భారత్ రికార్డులు బద్దలు కొడుతూ పైపైకి కేసులు,మరణాలు..తాజాగా 4,14,188 కరోనా కేసులు,3,915 మరణాలు
భారత దేశంలో కరోనా కంట్రోల్లో లేదు. మహమ్మారి విజృంభణ అప్పుడే ఆగేలా కనిపించటంలేదు. కరోనా మహమ్మారి తన విశ్వరూపాన్ని చూపిస్తూనే ఉంది. నిత్యం లక్షలాది సంఖ్యలో ప్రజలు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు.వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. భారత్ లో కొనసాగుతున్న కరోనా కల్లోలం ప్రపంచ దేశాలకు సైతం ఆందోళన కలిగిస్తుంది. నాలుగు లక్షలకు పైగా రోజువారి కేసులు,నాలుగు వేలకు చేరువగా మరణాలు నమోదవుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది.
Recommended Video
గత 24 గంటల్లో 4,14,188 కరోనా కేసులు,3,915 మరణాలు
భారతదేశంలో గత 24 గంటల్లో 4,14,188 కరోనా కేసులు,3,915 మరణాలు సంభవించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం తెలుస్తోంది. దీనితో ప్రస్తుతం దేశంలోని మొత్తం కేసుల సంఖ్య 2,14,91,598 కు చేరుకోగా, ఇప్పటివరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 2,34,083 కు పెరిగింది.ఇప్పటివరకు భారత దేశ వ్యాప్తంగా 1,76,12,351 మంది కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్నారు.
దేశంలో 36,45,164 క్రియాశీల కేసులు, క్రియాశీల కేసులు 16.96 శాతం
ప్రస్తుతం దేశంలో 36,45,164 క్రియాశీల కేసులు ఉన్నాయి.దీంతో కోవిడ్ -19 రికవరీ రేటు 81.95 శాతానికి పడిపోయిందని, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న కరోనా కేసులలో క్రియాశీల కేసులు 16.96 శాతంగా ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా నివారణకు ఇప్పటివరకు 16,49,73,058 మందికి టీకాలు వేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో 23,70,298 మందికి గత 24 గంటల్లో వ్యాక్సిన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్లతో సహా వివిధ రాష్ట్రాలు పూర్తి లాక్డౌన్లు మరియు ఇతర రాష్ట్రాల ఆంక్షలను కఠినతరం చేస్తున్నాయి.
కేరళ , మధ్యప్రదేశ్ లలో లాక్ డౌన్
గురువారం కొత్తగా 42,464 కొత్త కేసులు నమోదైన కేరళ శనివారం నుంచి ఎనిమిది రోజుల లాక్డౌన్ విధించింది. కేరళ రాష్ట్రం మొత్తం మే 8 ఉదయం 6 నుండి మే 16 వరకు లాక్డౌన్లో ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో కేరళలో లాక్ డౌన్ విధించినట్లుగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మే 15 వరకు అన్నింటినీ మూసివేయాలని ప్రజలకు చెప్పారు. రాష్ట్రంలో గురువారం 12,421 తాజా కేసులు మరియు 86 మరణాలు నమోదయ్యాయి.
రాజస్థాన్ లోనూ లాక్ డౌన్, ప్రపంచంలో రోజువారీ కేసుల్లో ఇండియా రికార్డ్
రాజస్థాన్ ప్రభుత్వం మే 10 నుండి మే 24 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ విధించింది.వరల్డ్మీటర్స్ ప్రకారం,కరోనా మహమ్మారి ఇప్పటివరకూ 156 మిలియన్లకు పైగా సోకింది .ప్రపంచవ్యాప్తంగా 3 మిలియన్ల మందికి పైగా మరణాలు సంభవించాయి. ప్రపంచంలోని రోజువారీ కేసుల నమోదులో ప్రపంచంలోనే భారతదేశం ముందుంది. వరుసగా రెండు రోజులుగా 4 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గురువారం, 4,12,262 తాజా కోవిడ్ -19 కేసులు నమోదు కాగా ఈ రోజు 4,14,188 కరోనా కేసులు నమోదు కావడం ఆందోళనను మరింత పెంచుతోంది.