వర్షం.. వందేళ్ల రికార్డ్ బద్దలు: చెన్నై విలవిల (పిక్చర్స్)
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో వందేళ్ల వర్షం రికార్డ్ బద్దలైంది. 1918లో రికార్డు వర్షపాతం నమోదైంది. నాడు నగరాన్ని ముంచెత్తిన వరుణుడు ఏకంగా 108.8 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయింది. తాజాగా, మరోసారి అంతకుమించి రికార్డ్ వర్షపాతం కురిసింది.
దాదాపు వందేళ్ల దాకా నాటి రికార్డ్ వర్షపాతం నమోదు కాలేదు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి కారణంగా రెండు రోజులుగా చెన్నైలో కురుస్తున్న భారీ వర్షం మాత్రం వందేళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టింది. సోమవారం అర్ధరాత్రి వరకే నగరంలో 119.73 సెంటీ మీటర్ల వర్షపాతం కురిసింది.
మంగళవారం కూడా ఎడతెరిపి లేని వర్షం చెన్నైని ముంచెత్తింది. మరో రెండు రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సోమవారం రాత్రికే చెన్నైలో అత్యధిక వర్షపాతం రికార్డు బద్దలు కాగా, వరుణుడు శాంతించేలోగా సరికొత్త రికార్డులు నమోదు కానున్నాయి.
ముఖ్యమంత్రి జయలలితకు ప్రధాని మోడీ ఫోన్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ఉదయం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఫోన్ చేశారు. వర్ష బీభత్సంపై ఆరా తీశారు. మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపడంతో పాటు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వరద సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
చెన్నై విలవిల
చెన్నైలో రోజులుగా కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో నగరం జలదిగ్బంధంలో ఉండిపోయింది. సైకిల్ నుంచి విమానం వరకు అన్ని బంద్ అయ్యాయి. విద్యుత్ లేకపోవడంతో చెన్నై నగరం అంధకారంలో మునిగిపోయింది. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు.
చెన్నై విలవిల
నగరంలోని చాలా కాలనీలు నీట మునిగాయి. భారీగా కురిసిన వర్షం కారణంగా చెన్నై విమానాశ్రయం మూతపడింది. విమానాశ్రయం రన్ వే పైకి వర్షపు నీరు చేరింది. అక్కడ నిలిచిన విమానాల అండర్ క్యారేజీలను తాకుతూ వరద నీరు ప్రవహిస్తోంది. మొత్తం రన్ వే నీటిలో మునిగిపోయింది.
చెన్నై విలవిల
విమానాశ్రయంలో ప్రయాణికులు చిక్కుకుపోయారు. మంగళవారం రాత్రి తొమ్మిది గంటల సమయానికి తొమ్మిది విమాన సర్వీసులు రద్దయ్యాయి. రన్ వేపై చేరిన నీరంతా పూర్తిగా వెళ్లిపోయేదాకా విమాన సర్వీసులను పునరుద్ధరించలేమని విమానాశ్రయ డైరెక్టర్ దీపక్ శాస్త్రి చెప్పారు.
చెన్నై విలవిల
మరోవైపు, చెన్నై ప్రజలు అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి ఉంది. మూడో వంతు నగరం నీట మునిగింది. ప్రజలకు నిత్యావసర వస్తువులు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. పాలు, నీరు, ఆహార పదార్థాలు ఏమీ దొరకడం లేదు. వర్షంతో చెన్నై విలవిల్లాడుతోంది.
చెన్నై విలవిల
నగరంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు కొట్టుకుపోయాయి. ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని భవనాలపైకి ఎక్కి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.