ప్రాంతీయ పార్టీలో అది సాధ్యం కాదు, కాంగ్రెస్ పార్టీతోనే అంటూ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అక్టోబర్ నుంచి దేశ వ్యాప్త యాత్ర నిర్వహించనున్నట్లు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వెల్లడించారు. రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్పూర్లో చింతన్ శిబిర్ సమావేశాల ముగింపు కార్యక్రమం సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. స్వాతంత్ర్యం పూర్వం నుంచి తమ పార్టీ ప్రజలతోనే మమేకమై ఉందన్నారు.
భారతీయ జనతా పార్టీలో దళితులకు సరైన స్థానమే లేదని విమర్శించారు. కానీ, కాంగ్రెస్ మాత్రం అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యం ఇస్తుందన్నారు. నేరుగా ప్రజలతో సంబంధం అనేది కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందన్నారు. పార్టీని బలోపేతం చేయాలంటే దగ్గరి దారులు ఉండవన్నారు. నేతలంతా కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో తుది శ్వాస వరకు వెంట ఉంటానని భరోసా ఇచ్చారు.
ప్రజలతో పార్టీకి సంబంధాలు తెగిపోయాయన్న విషయాన్ని అంగీకరించాలని, అదే సమయంలో దేశాన్ని ముందుకు నడిపించే సత్తా కంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందనే విశ్వాసం ప్రజలకు ఉందన్నారు రాహుల్ గాంధీ. ఈ నేపథ్యంలో ప్రజలతో మళ్లీ సత్సంబంధాలను ఏర్పరచుకునేందుకు షార్ట్ కట్ ఏదీ లేదని, అందుకోసం శ్రమించాల్సిందేనని అన్నారు. ఇందుకు కేవలం ఒకటి రెండు రోజులు సరిపోవన్నారు. నెలలపాటు కష్టపడాల్సిందేనని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
చింతన్ శిబిర్లో చర్చలు బాగా జరిగాయని, నేతలంతా సూటిగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇతర రాజకీయ పార్టీలు ఇలాంటివి జరగనివ్వవని అన్నారు. తాను ఎన్నడూ అవినీతికి పాల్పడలేదని రాహుల్ గాంధీ చెప్పారు. బీజేపీకి భయపడేది లేదన్నారు. బీజేపీపై పోరాటం కొనసాగిస్తామని అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ మాదిరిగా ప్రాంతీయ పార్టీలు పోరాటం చేయలేవన్నారు.
బీజేపీ కూడా ఎప్పుడూ కాంగ్రెస్ గురించే మాట్లాడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలో తెలుసన్నారు. ఈ సందర్భంగా దేశాన్ని రాష్ట్రాల సమాఖ్యగా పేర్కొన్నారు రాహుల్. రాష్ట్రాల కలయికతోనే కేంద్రం ఏర్పడిందని రాజ్యాంగం చెప్తోందన్నారు. దేశంలోని వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు.