రెండోసారి వైరస్ ప్రభావం ఎక్కువే.. తప్పనిసరిగా ఆస్పత్రికి వెళ్లాల్సిందే.. అధ్యయనం
కరోనా వైరస్ గురించి రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. అయితే తాజా అధ్యయనం మరో కొత్త విషయం చెప్పింది. రెండోసారి వైరస్ సోకితే ప్రభావం ఎక్కువే చూపిస్తోందని తేలింది. తక్కువ ప్రభావం చూపిస్తుందనే వాదనకు బలం లేదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. యాంటీబాడీస్ ఉన్నప్పటికీ రెండోసారి వైరస్ సోకిన సమయంలో కొందరిలో మొదటిసారి కన్నా ఎక్కువ తీవ్రత కనిపించిందని తెలిపారు.

అధ్యయనం..
ముంబైలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజినీరింగ్ అండ్ బయోటెక్నాలజీ, ఢిల్లీలోని సీఎస్ఐఆర్-ఇనిస్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ పరిశోధకులు అద్యయనం చేశారు. ఈ రెండు సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్తో కలిసి ముంబైలోని కస్తూర్బా హాస్పిటల్ ఫర్ ఇన్ఫెక్షియస్ డిసీజ్, పీడీ హిందుజా హాస్పిటల్ నిపుణులు కూడా ఈ అధ్యయనంలో పాల్గొన్నారు.

స్వల్ప లక్షణాలు..
అద్యయనంలో భాగంగా నలుగురు యువ హెల్త్కేర్ వర్కర్లను పరిశీలించారు. వీరికి మొదటిసారి స్వల్ప లక్షణాలతో కరోనా వైరస్ సోకింది. కోలుకున్న కొద్ది వారాల తర్వాత మళ్ళీ మరొసారి వ్యాధి సోకింది. రెండోసారి తీవ్రమైన లక్షణాలతో ఆసుపత్రిలో చేరి, చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నలుగురిలో ఒకరికి ప్లాస్మా థెరపీ కూడా చేయాల్సి వచ్చింది. మరొకరు మూడు వారాలపాటు విధులకు హాజరు కాలేకపోయారు.

అత్యంత అరుదు..
కరోనా వైరస్ రీ-ఇన్ఫెక్షన్ ఘటనకు సంబంధించి ఆధారాలు అత్యంత అరుదుగా కనిపిస్తున్నాయని సీఎస్ఐఆర్-ఐజీఐబీ శాస్త్రవేత్త డాక్టర్ అనురాగ్ అగర్వాల్
తెలిపారు. వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత కూడా ప్రజలు, వైద్యులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని అధ్యయనంలో స్పష్టంగా వెల్లడైందని తెలిపారు. రోగ నిరోధక శక్తికి ఎలాంటి హామీ లేదన్నారు. అలాగే వైరస్ నుంచి రక్షణ స్వల్ప కాలమేనని తెలిపారు. మరొసారి వ్యాధి తీవ్రంగా సోకే అవకాశం ఉందని తమ అధ్యయనంలో వెల్లడైందని చెప్పారు.












Click it and Unblock the Notifications