మోడీ ఫోటో వాడుకున్నందుకు.. రిలయన్స్కు ఇంత జరిమానా!
కేంద్ర అనుమతి లేకుండా కేవలం సంస్థాగత ప్రయోజనాల కోసం ప్రధాని మోడీ ఫోటో వాడుకోవడంతో రూ.500 జరిమానా విధిస్తామని ప్రకటించింది కేంద్రం.
న్యూఢిల్లీ: కేంద్ర అనుమతి లేకుండా కేవలం సంస్థాగత ప్రయోజనాల కోసం ప్రధాని మోడీ ఫోటో వాడుకోవడం పట్ల దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జియో ఉచిత సర్వీసులను మార్చి వరకు పొడగిస్తూ.. అంబానీ ప్రకటించిన నేపథ్యంలో.. తాజా ప్రకటనకు సంబంధించిన యాడ్ జాతీయ పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించింది జియో.
అయితే ఈ ప్రకటనల్లో ప్రధాని మోడీ ఫోటోను అనుమతి లేకుండా వాడుకుంది రిలయన్స్. దీనిపై రాజ్యసభలో సైతం ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. ప్రధాని ఫొటో రిలయన్స్ ప్రకటనల్లో వాడుకునేందుకు అనుమతి మంజూరు చేశారా? అంటూ సమాజ్వాదీ పార్టీ ఎంపీ నీరజ్ శేఖర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
దీనిపై లిఖిత పూర్వక సమాధానం ఇచ్చిన సమాచార మంత్రిత్వశాఖ సహాయ మంత్రి రాజ్యవర్థన్సింగ్ రాథోడ్.. జియో ప్రకటనల్లో ప్రధాని మోదీ ఫొటో వాడుకునేందుకు కేంద్రం ఎటువంటి అనుమతి మంజూరు చేయలేదని వెల్లడించారు. ప్రతిపక్షాల డిమాండ్ మేరకు 1950 చట్టం ప్రకారం రిలయన్స్ వ్యవహరించిన తీరుపై కఠిన చర్యలుంటాయని రిలయన్స్ ప్రకటించింది.
జరిమానా.. జస్ట్ రూ.500 మాత్రమే :
చట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను చర్యలు చేపడుతామని ప్రకటించిన కేంద్రం.. రిలయన్స్ పై ఎంత పెద్ద చర్య తీసుకుందంటే.. కేవలం రూ.500 జరిమానా విధిస్తామని ప్రకటించింది. రిలయన్స్ కు ఇంత తక్కువ జరిమానా విధించడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
కాగా, సెక్షన్-3 లోని యాక్ట్ ప్రకారం.. వ్యక్తిగత, సంస్థాగత ప్రయోజనాల కోసం ప్రజా ప్రతినిధులుగా వ్యవహరిస్తున్న వారి ఫోటోలు ఉపయోగించుకోవడం నేరం. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు, మహాత్మగాంధీ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, అశోక చక్ర వంటి చిహ్నాలను, పేర్లను ఉపయోగించడం చట్టాన్ని అతిక్రమించడమే అవుతుంది.