కరోనా వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిన రిలయన్స్: క్లినికల్ ట్రయల్స్కు అనుమతి
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం దేశవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. 60 కోట్ల మందికి పైగా ప్రజలు కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారు. ఇందులో తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్యే అధికం. రెండో డోసు కోసం సుమారు 80 నుంచి 90 రోజుల పాటు వ్యవధి ఉంటోంది. తొలి డోసు, రెండో డోసు మధ్య వ్యవధిని పెంచడం వల్ల వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తొలి రోజుల్లో ఉన్నంత కొరత ఇప్పుడు లేదు. పైగా కేంద్ర ప్రభుత్వమే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తోంది. రాష్ట్రాలకు ఉచితంగా టీకాలను సరఫరా చేస్తోంది.
వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లు విస్తృతంగా వినియోగిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇందులోనూ కోవిషీల్డ్ వాటా అధికంగా ఉంటోంది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉన్నప్పటికీ.. అది పరిమితమే. ఎంపిక చేసిన కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు, ఇతర వ్యాక్సినేషన్ కేంద్రాల్లో స్పుత్నిక్- వీ వాడకంలో ఉంటోంది. వాటితో పాటు అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకోవడానికి జైడస్ క్యాండిలా, జాన్సన్ అండ్ జాన్సన్, మోడెర్నా వ్యాక్సిన్లు కూడా త్వరలోనే ఎంట్రీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు.

వాటికి సంబంధించిన దరఖాస్తులు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వద్ద పరిశీనలో ఉన్నాయి. ఈ పరిణామాల మధ్య దేశీయ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ యాజమాన్యం కూడా కరోనా వైరస్ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్ను అభివృద్ధి చేసింది. రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఒకటైన రిలయన్స్ లైఫ్ సైన్సెస్ ఈ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసింది. తొలిదశ క్లినికల్ ట్రయల్స్ను నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ దరఖాస్తులను దాఖలు చేసింది.
తాజాగా ఈ దరఖాస్తులపై సబ్జెక్ట్ టు ఎక్స్పర్ట్ కమిటీ (ఎస్ఈసీ) ఆమోదముద్ర వేసింది. రీకాంబినెంట్ ప్రొటీన్ వ్యాక్సిన్ ఇది. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పని చేస్తోన్న బయోలాజికల్. ఈ లిమిటెడ్ అభివృద్ధి చేస్తోన్న ప్రొటీన్ ఆధారిత వ్యాక్సిన్ను పోలి ఉంటుంది. రిలయన్స్ లైఫ్ సైన్సెస్ వ్యాక్సిన్పై తొలి విడత క్లినికల్ ట్రయల్స్కు సబ్జెక్ట్ టు ఎక్స్పర్ట్ కమిటీ అనుమతి లభించింది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు సిఫారసులను పంపించింది. డీసీజీఐ అనుమతి రావడం లాంఛనప్రాయమే అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
తొలి విడత క్లినికల్ ట్రయల్స్ సాధారణంగా 58 రోజుల పాటు నిర్వహిస్తారు. వాటిని పూర్తి చేసుకున్న వెంటనే తాము 2, 3 ట్రయల్స్ కోసం అనుమతి కోరుతామని రిలయన్స్ లైఫ్ సైన్సెస్ ప్రతినిధులు తెలిపారు. మ్యాగ్జిమమ్ టోలరేటెడ్ డోస్ను నిర్ధారించడం, టీకా తీసుకున్న వారికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనే విషయంపై అధ్యయనం చేయడానికి క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత వారి సేఫ్టీ, టోలరేబిలిటీ, ఫార్మాకొకినెటిక్స్ వంటి అంశాలపై అధ్యయనం చేస్తామని అన్నారు.
ప్రస్తుతం సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తోన్న కోవిషీల్డ్, హైదరాబాదీ ఫార్మాసూటికల్స్ కంపెనీ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్, రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ జాబితాలో త్వరలో జైడస్ క్యాడిలా డెవలప్ చేసిన జైకోవ్ డీ వ్యాక్సిన్ చేరనుంది. దీన్ని అత్యవసర వినియోగానికి ఇదివరకే ఎస్ఈసీ అనుమతి ఇచ్చింది. ఇక జాన్సన్ అండ్ జాన్సన్, మోడెర్నా దరఖాస్తులు ప్రస్తుతం పరిశీలన దశలో ఉన్నాయి.












Click it and Unblock the Notifications