నటి, మోడల్ మైత్రేయకు షాక్, సదానంద కొడుకుకి ఊరట
బెంగళూరు: కేంద్రమంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్ గౌడకు కర్నాటక రాజధాని బెంగళూరు కుటుంబ న్యాయస్థానంలో ఊరట లభించింది. అదే సమయంలో నటి, మోడల్ మైత్రేయ గౌడకు షాక్! కార్తీక్ గౌడతో తనకు వివాహం అయిందని, దానిని అధికారికంగా గుర్తించాలని మైత్రేయ గౌడ దాఖలు చేసిన పిటిషన్ను బెంగళూరులోని ఫ్యామిలీ కోర్టు కొట్టివేసింది. బుధవారం ఈ పిటిషన్ను విచారించిన కోర్టు.. సరైన సాక్ష్యాలు లేవంటూ దానిని కొట్టివేస్తున్నట్లు తెలిపింది.
కాగా, కేంద్రమంత్రి డీవీ సదానంద గౌడ తనయుడు కార్తీక్ గౌడ నిశ్చితార్థం ఇటీవల జరుగుతున్న సమయంలో నటి, మోడల్ అయిన మైత్రేయ.. ఇంతకుముందే అతను తనను వివాహం చేసుకున్నాడని బెంగళూరులో తెలిపింది. తనకు అన్యాయం చేయవద్దని విజ్ఞప్తి చేసింది.
గత మే నెలలో పరిచయం అయిందని కొంత కాలానికే వివాహం చేసుకున్నాడని ఆమె చెప్పింది. కార్తీక్ గౌడతో కలిసి ఉన్న ఫోటోలను మీడియాకు విడుదల చేసింది. ఈ వ్యవహారాన్ని సదానంద గౌడ తోసిపుచ్చారు. ఇది ఒక కుట్రగా సదానంద అభివర్ణించారు. కార్తీక్ గౌడ్ స్పందిస్తూ అసలు మైత్రేయ ఎవరో తనకు తెలియదని చెప్పారు. తన తండ్రి ఉన్నత స్థానంలో ఉన్నారని, ఆయన గౌరవానికి తాను భంగం ఎలా కలిగిస్తానని వ్యాఖ్యానించారు.
మైత్రేయ పోలీసు స్టేషన్లో సదానంద గౌడ తనయుడికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసింది. అనంతరం ఈ కేసు పలు మలుపులు తిరిగింది. కార్తీక్ గౌడ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యాడు. ఇదిలా ఉండగా, దీని పైన మైత్రేయ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిని విచారించిన కోర్టు సాక్ష్యాలు లేవని కొట్టివేసింది.