కేరళ గోల్డ్ స్మగ్లింగ్ స్కామ్... సీఎం పినరయి విజయన్కు రిలీఫ్... ఎన్ఐఏ ఏం చెప్పిందంటే...
కేరళలోని తిరువనంతపురంలో వెలుగుచూసిన గోల్డ్ స్మగ్లింగ్ స్కామ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రమేయానికి సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు దొరకలేదని ఎన్ఐఏ స్పష్టం చేసింది. ముఖ్యమంత్రిని లేదా సీఎంవో కార్యాలయాన్ని ఈ కేసులో చేర్చేందుకు ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంది. గోల్డ్ స్మగ్లింగ్ స్కామ్లో పినరయి విజయన్ సర్కార్పై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ ఎన్ఐఏ తాజా ప్రకటన ముఖ్యమంత్రికి రిలీఫ్ అనే చెప్పాలి.
Recommended Video
ఈ కేసులో ప్రధాన నిందితురాలైన స్వప్న సురేషే స్మగ్లింగ్ రాకెట్ వెనుక కీలకంగా వ్యవహరించారని ఎన్ఐఏ తెలిపింది. రాష్ట్రంలోని యూఏఈ రాయబార కార్యాలయం నుంచి సీఎంవో కార్యాలయం వరకూ ఆమె అన్నింటినీ మేనేజ్ చేయగలిగారని పేర్కొంది. 'స్వప్న సురేష్ చాలా తెలివిగల అమ్మాయి. బాగా మాట్లాడగలదు,పనులు పూర్తి చేయించుకోవడంలో నేర్పరి.ముఖ్యమంత్రి మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం శివశంకర్తో ఆమెకు స్నేహం ఉంది. అయితే ఇందులో ముఖ్యమంత్రి ప్రమేయం గురించి ఇప్పటికైతే ఏమీ తేలలేదు.' అని ఎన్ఐఏ వెల్లడించింది.గోల్డ్ స్మగ్లింగ్ స్కామ్లో స్వప్న సురేష్తో లింకులు ఉన్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ శివశంకర్పై ప్రభుత్వం వేటు వేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు విపక్ష పార్టీలు కాంగ్రెస్,బీజేపీ ముఖ్యమంత్రి విజయనే దీనికి బాధ్యుడని ఆరోపిస్తూ ఆయన రాజీనామాకు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రంలో మరో 8 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ వివాదం వివపక్షాలకు ఓ అస్త్రంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ నేత్రుత్వంలోని యూడీఎఫ్ విజయన్ సర్కార్పై అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టగా అది వీగిపోయింది. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్ సీఎం రాజీనామాకు డిమాండ్ చేస్తూ ఒకరోజు దీక్ష చేశారు.
కాగా,జులై 5న ఈ గోల్డ్ స్మగ్లింగ్ స్కామ్ వెలుగుచూసిన సంగతి తెలిసిందే. దౌత్య మార్గంలో తరలిన రూ. 15 కోట్ల విలువైన 30 కిలోల బంగారం తిరువనంతపురం విమానాశ్రయంలో పట్టుబడింది.ఈ ఘటనకు సంబంధించి కేరళలో యూఏఈ కాన్సులేట్లో పనిచేసే ఓ మాజీ ఉద్యోగిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అతన్ని విచారించగా.. ఇందులో ఐటీ విభాగంలో పనిచేసే స్వప్న సురేశ్ హస్తం ఉన్నట్టు వెల్లడించాడు. దీంతో ఐటీ శాఖ ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది. ప్రస్తుతం ఈ కేసును ఎన్ఐఏ విచారిస్తోంది.