హిందుత్వంలోకి ముస్లీంలు: సభలో రగడ, టీఎంసీ ఎంపీ 'సారీ'
న్యూఢిల్లీ: పార్లమెంటులో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలోని మతమార్పిళ్ల అంశంపై బుధవారం దద్దరిల్లింది. అగ్రాలో బలవంతంగా మతమార్పిడులను ప్రోత్సహిస్తున్నారని విపక్షాలు ఆరోపించాయి. అగ్రాలోని ఓ గ్రామంలో దాదాపు రెండువందల మంది ముస్లీంలో హిందూమతంలోకి మారారు.
ఈ విషయమై కాంగ్రెస్ నేత మనీష్ తివారి మాట్లాడుతూ.. మనది ప్రజాస్వామ్య, లౌకిక దేశమని, బలవంతపు మతమార్పిడిలను అరికట్టేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని అన్నారు. దీనిపై బీజేపీ నేత కల్రాజ్ మిశ్రా మాట్లాడుతూ.. అగ్రాలోని మతమార్పిళ్లు బలవంతంవి కావని చెప్పారు.
క్షమాపణలు చెప్పిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ
ప్రధాని నరేంద్ర మోడీ పైన చేసిన వ్యాఖ్యలకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కల్యాణ్ బెనర్జీ బుధవారం క్షమాపణలు చెప్పారు. ఆయన లోకసభలో మాట్లాడుతూ.. తాను ప్రధాని పైన చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు. అంతేకాదు క్షమాపణలు కోరారు.
ఎవరినీ బాధించాలన్న ఆలోచన తనకు లేదన్నారు. మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, ఇతర నేతలను, ప్రజల నిర్ణయాన్ని ఎంపీలు గౌరవించాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ సభలో సభ్యులందరినీ కోరారు.
కాగా, పశ్చిమ బెంగాల్లో ఇటీవల ఓ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహుదూర్ శాస్త్రిపై బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇందుకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ, కేంద్ర ప్రభుత్వం మంగళవారం డిమాండ్ చేశాయి. లేకుంటే ఎంపీపై అభిశంసన తీర్మానం పెడతామని కూడా హెచ్చరించారు.
తెలంగాణపై కేకే..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరు నెలలైనా ఐపీఎస్ ఆధికారుల ఖాళీలను భర్తీ చేయడం లేదని తెరాస ఎంపీ కె కేశవరావు రాజ్యసభలో ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న ఐపీఎస్ పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేకే ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజుమాట్లాడుతూ.. ప్రధాని కార్యాలయం నుంచి సమాచారం రాగానే తెలంగాణకు ఐపీఎస్ అధికారుల కేటాయింపుపై స్పష్టత ఇస్తామని చెప్పారు.