పుర్రెను తినేసిన బుల్లెట్, ఐదు గంటలపాటు శ్రమించి కాపాడారు.
న్యూఢిల్లీ: పుర్రెలోకి బుల్లెట్ దూసుకెళ్లి ప్రాణాపాయ పరిస్ధితిలో ఉన్న ఓ 50ఏళ్ల మనిషికి వైద్యులు ప్రాణం పోశారు. క్లిష్టమైన మెదడు ఆపరేషన్ను నిర్వహించి అతనికి కొత్త ఊపరినిచ్చారు. వివరాల్లోకి వెళితే, కాన్పూర్కు చెందిన హాకీంసింగ్ (50) వృత్తిరీత్యా ధార్మిక గ్రంధాలను పారాయణం చేస్తుంటాడు.
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో జనవరి 10న శ్రీమద్భాగవత పారాయణం చేస్తుండగా, గాల్లోకి జరిపిన తుపాకీ కాల్పుల్లో హకీం సింగ్కు గుండు తగిలి గాయపడటంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ సరైన సౌకర్యాలు లేకపోవడంతో గ్వాలియర్లోని మరో ఆసుపత్రికి, అక్కడనుంచి ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు.
అక్కడ పడకలు ఖాళీ లేవంటూ చేర్చుకోకపోవడంతో అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పారని బాధితుడి కుమారుడు అభయ్ ప్రతాప్ తెలిపారు. చివరకి ఘటన జరిగిన 27 గంటల తర్వాత హకీం సింగ్ను ఇంద్రప్రస్ధలోని అపోలోలో చేర్చారు.
హకీంసింగ్ను విషమ పరిస్దితుల్లో ఆసుపత్రికి తీసుకొచ్చారని, తుపాకీ గుండు తలలో ఒకవైపు నుంచి దూరి, మరోవైపు నుంచి బయటకు వెళ్లిందని అపోలో వైద్యులు డాక్టర్ ప్రణవ్ కుమార్ వెల్లడించారు. ముందుభాగంలో పుర్రె ఎముక పలు చోట్ల విరిగి, ముక్కలు లోపలే ఉండిపోయాయని, మెదడుకు తీవ్రమైన దెబ్బలు తగిలాయని వెల్లడించారు.
సుమారు ఐదు గంటల పాటు నిర్వహించిన ఈ క్లిష్టమైన మెదడు ఆపరేషన్తో విరిగిన ఎముకలు తొలగించి, ఇతరత్రా చికిత్సలూ చేసినట్లు ఆయన తెలిపారు.