డిఆర్డివో చైర్మన్కు ఉద్వాసన: సమర్థించుకున్న పరిక్కర్
న్యూఢిల్లీ: డీఆర్డీవో ఛైర్మన్ అవినాష్ చందర్కు కేంద్ర ప్రభుత్వం ఉద్వాసన పలికింది. ఈనెల 31 నాటికి బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆదేశించింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) చైర్మన్గా వ్యవహరిస్తున్న అవినాష్ చందర్ను కేంద్రం తప్పించింది. ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ కమిటీ ఈ నిర్ణయాన్ని ఆమోదించింది.
డీఆర్డీవోకు చైర్మన్గానే గాక రక్షణ మంత్రికి శాస్త్ర, సాంకేతిక సలహాదారుగా కూడా ఉన్న చందర్ గత నవంబర్ 30న తన 64 ఏళ్ల వయసులో రిటైరయ్యారు. అయితే, మరో 18 నెలలపాటు చైర్మన్గానే కొనసాగేందుకు కేం ద్రం నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం ఆయన వచ్చే ఏడాది మే వరకు ఆ పదవిలో కొనసాగాల్సి ఉండగా ప్రభుత్వం అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకుంది. నిరుడు ఏడాది డీఆర్డీవోను సందర్శించిన ప్రధాని నరేంద్ర మోడీ ‘లక్ష్యాల నుంచి సంస్థ వెనక్కు తగ్గే ధోరణిని అవలంబిస్తే సహించబోమని హెచ్చరించిన సంగతి తెలిసిందే.
మరోవైపు తన తొలగింపుపై స్పందించేందుకు అవినాష్ చందర్ నిరాకరించారు. కేంద్రం అవినాష్ను తొలగించడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. అవినాష్ చందర్ తొలగింపును కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది.
తానే సిఫార్సు చేశానని, కాంట్రాక్టుపై ఉన్న వ్యక్తి ఇటువంటి సీనియర్ హోదాలో ఉండడం సరి కాదని, దానికి అర్హులు చాలా మంది ఉన్నారని రక్షణ మంత్రి మనోహర్ పరిక్కర్ మీడియా ప్రతినిధులతో అన్నారు. దేశానికి చెందిన అతి ప్రధానమైన రక్షణ పరిశోధనా సంస్థ చైర్మన్ పదవిని అభివృద్ధిపై కోరిక ఉన్న యువ శాస్త్రవేత్త చేపడుతారని ఆయన అన్నారు.
కాగా, అవినాష్ చందర్కు బుధవారంనాడు ప్రభుత్వం అధికారికంగా ఏ విధమైన నోటీసు కూడా ఇవ్వలేదు. ఆయ.న కార్యాలయానికి హాజరయ్యారు. 64 ఏళ్ల చందర్ స్థానంలో డిఆర్డివో చైర్మన్గా శేఖర్ బసు వస్తారని తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం బాబా అణు పరిశోధనా కేంద్రం డైరెక్టర్గా ఉన్నారు.