రాజీనామాకు ముందు 'రాసలీలల' గవర్నర్ ఇలా...
రాసలీలలు సాగించి రాజీనామా చేసిన మేఘాలయ గవర్నర్ లీలలు ఇంకా బయపడుతున్నాయి. రాజీనామాకు ముందు ఓ లేడీకి ఆయన ప్రమోషన్ ఇచ్చారు.
మేఘాలయ: రాజభవన్ కేంద్రంగా రాసలీలలు జరిపారనే ఆరోపణలు ఎదుర్కుని మేఘాలయ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన వి. షణ్ముగనాథన్ కార్యకలాపాలు మరిన్ని వెలుగు చూస్తున్నాయి. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు రాజభవన్ సిబ్బంది ఫిర్యాదు చేయడంతో షణ్ముగనాథన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కుంటున్న సమయంలోనే తన పిఎ (పర్సనల్ అసిస్టెంట్)గా పనిచేస్తున్న ఓ మహిళకు ప్రజా సంబంధాల అధికారి (పిఆర్వో)గా ప్రమోషన్ ఇచ్చారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ మహిలను ఆయన స్వయంగా ఇంటర్వ్యూ చేయడమే కాకుండా నిబంధనలను కాలరాసి తన రాజీనామాకు ముందు పదోన్నతి కల్పించారనే ఆరోపణలు వచ్చాయి.
రాజ్భవనే అమ్మాయిల క్లబ్: రాసలీల గవర్నర్ రాజీనామా
ఈ ఇంటర్వ్యూకు హాజరైన ఇతర అభ్యర్థులు కూడా షణ్ముగం తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సీనియర్ అధికారులు ఇంటర్వ్యూ చేసిన తర్వాత గవర్నర్ తమను వన్ టు వన్ ఇంటర్వ్యూ చేశారని చెప్పారు. 2016 మార్చిలో గవర్నర్కు పిఎగా నియమితులైన మహిళనే డిసెంబర్ 7వ తేదీన పిఆర్వోగా నియమించుకున్నట్లు చెబుతున్నారు.
పిఎగా ఉన్నప్పుడు ఆమెకు రూ.6,500 నుంచి 12,700 వరకు జీతం ఉండగా పిఆర్వోగా నియమితులైన తర్వాత నెలకు రూ.30 వేల వేతనాన్ని నిర్ణయించారు. వన్ టూ వన్ ఇంటర్వ్యూ పేరిట తనతో షణ్ముగం అసభ్యంగా ప్రవర్తించినట్లు ఓ మహిళ తనతో చెప్పినట్లు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న మరో మహిళ చెప్పారు.
ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూకు తనను పిలువ లేదని, కానీ ఇంటర్వ్యూ కోసం ఇద్దరు మహిళా అభ్యర్థులకు గవర్నర్ స్వయంగా ఫోన్ చేశారని ఆమె చెప్పారు.