ఆ వ్యాక్సిన్ స్టాక్ను వెనక్కి పంపించండి... ప్రైవేట్ వ్యాక్సిన్ సెంటర్లకు కేంద్రం కీలక ఆదేశాలు...
దేశవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్లలో ఇప్పటివరకూ ఉపయోగించని వ్యాక్సిన్ స్టాక్ను రాష్ట్ర ప్రభుత్వాలకు రిటర్న్ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
శుక్రవారం(ఏప్రిల్ 30) లోగా ఆ వ్యాక్సిన్ స్టాక్ను వెనక్కి పంపించాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
'ప్రైవేట్ కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్లలో ఉపయోగించని వ్యాక్సిన్ స్టాక్ను ఏప్రిల్ 30 లోగా తమ రాష్ట్రాల్లోని కోల్డ్ చైన్ పాయింట్లో రిటర్న్ చేయాలి. మాన్యుఫాక్చరర్స్ నుంచి కొత్త వ్యాక్సిన్ స్టాక్ వచ్చేంతవరకూ ప్రైవేట్ వ్యాక్సిన్ సెంటర్లు ఎవరికీ వ్యాక్సిన్ ఇవ్వకూడదు. బహుశా మే 1న కొత్త స్టాక్ వారికి అందవచ్చు.' అని కేంద్రం స్పష్టం చేసింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారత్ బయోటెక్ కోవాగ్జిన్, సీరం ఇన్స్టిట్యూట్ తయారుచేసిన కోవిషీల్డ్ టీకాలను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. సీరం ఇన్స్టిట్యూట్ కేంద్రానికి ఒక్కో డోసును రూ.150 చొప్పున విక్రయిస్తోంది.అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.300లకు విక్రయిస్తోంది. ఇక ప్రైవేట్ మార్కెట్లో రూ.600లకు విక్రయించనున్నట్లు గతంలోనే వెల్లడించింది. ఇక భారత్ బయోటెక్ కోవాగ్జిన్ ఒక్కో డోసు రూ.150కి కేంద్రానికి విక్రయిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400కి విక్రయిస్తోంది. దేశంలో కోవిడ్ తీవ్రత దృష్ట్యా అంతకుముందు రూ.600గా ఉన్న ధరను భారత్ బయోటెక్ రూ.400కి తగ్గించింది.
టీకా ధరలపై ఇప్పటికీ విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఒకే వ్యాక్సిన్ను కేంద్రానికి ఒక ధరకు,రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ధరకు విక్రయించడమేంటని ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మన దేశంలో తయారుచేసే టీకాలను మనకే ఎక్కువ ధరకు విక్రయిస్తారా అని సామాన్యులు సైతం ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వ్యాక్సిన్ ధరల భారాన్ని ప్రభుత్వాలే భరించనున్నాయి. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఉచిత వ్యాక్సినేషన్ చేపట్టనున్నాయి. తెలంగాణలో దివ్యాంగులకు ఇంటికే వచ్చి కరోనా వ్యాక్సిన్ వేసే విధంగా చర్యలు చేపట్టనున్నారు. ఉచిత వ్యాక్సిన్కు సరిపడా డోసులు సరఫరా చేయాలని తెలంగాణ ప్రభుత్వం భారత్ బయోటెక్ను ప్రభుత్వం కోరింది. ప్రభుత్వ విజ్ఞప్తికి భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా సానుకూలంగా స్పందించారు. తెలంగాణలో ఉచిత వ్యాక్సినేషన్ కు తమ తోడ్పాటు ఉంటుందని, అందుకు అవసరమైన టీకా డోసులు అందజేస్తామని వెల్లడించారు. కరోనా టీకా డోసుల పంపిణీలో తెలంగాణకు తగిన ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉచిత వ్యాక్సినేషన్ కోసం రూ.2,500 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.












Click it and Unblock the Notifications