Aisha Sultana : లక్షద్వీప్ బీజేపీలో రాజద్రోహం చిచ్చు-మూకుమ్మడి రాజీనామాలు
లక్షద్వీప్ బీజేపీ ఫిర్యాదు మేరకు కేరళ నటి, నిర్మాత అయిషా సుల్తానాపై నమోదైన రాజద్రోహం ఆరోపణల కేసుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పోలీసుల చర్యను అన్ని పార్టీలు ఖండిస్తుండగా.. బీజేపీలోనూ ఇది చిచ్చురేపింది. చివరికి లక్షద్వీప్ బీజేపీ అధ్యక్షుడి తీరుకు నిరసనగా నేతలంతా మూకుమ్మడి రాజీనామాలు ప్రకటించారు.
ఓ మళయాళ టీవీ ఛానల్ చర్చలో మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ లక్షద్వీప్లోకి కరోనా వైరస్ రూపంలో జీవాయుధం ప్రయోగించిందని అయిషా సుల్తానా ఆరోపించారు. దీనిపై లక్షద్వీప్ బీజేపీ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాజద్రోహం, విద్వేష ప్రసంగాల సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేశారు. అయితే అయిషా వ్యాఖ్యల్ని అక్కడి అన్ని పార్టీలు సమర్ధించాయి. ముఖ్యంగా అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్ వచ్చాకే అక్కడ 9 వేల కరోనా కేసులు నమోదయ్యాయన్న అయిషా వ్యాఖ్యలకు భారీ మద్దతు లభించింది.
అయిషా సుల్తానాపై రాజద్రోహం సెక్షన్ ప్రయోగించడంపై స్ధానికంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అక్కడి బీజేపీ నేతలపైనా ఒత్తిడి పెరుగుతోంది. గతంలో అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేసిన వీరంతా ఇప్పుడు పోలీసుల రాజద్రోహం సెక్షన్కు కారణమైన బీజేపీ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్పై విరుచుకుపడుతున్నారు. దీనికి నిరసనగా వారంతా ఇవాళ మూకుమ్మడి రాజీనామాలు ప్రకటించారు. అయిషాపై మోపిన అభియోగాలు తప్పని వారు అభిప్రాయపడ్డారు. అయిషా కుటుంబాన్ని, ఆమె భవిష్యత్తును ప్రమాదంలో పడేసే రాజద్రోహం ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ నిర్ణయాలు ప్రజాస్వామ్య వ్యతిరేకమని, ప్రజా వ్యతిరేకమని, ప్రజలపై తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నాయని వారు ఆరోపించారు.