రింకూ సింగ్: కోచింగ్ సెంటర్లో గదులు తుడిచే పని నుంచి ఐపీఎల్ క్రికెట్ స్టార్ దాకా...
జీవితంలో కొందరికి చాలా ఆప్షన్లు ఉంటాయి. కానీ, ఏ ఆప్షన్ లేని వాళ్లు కూడా ఉంటారు. వాళ్లేం చేస్తారు? వాళ్లు మొదటి నుంచి తమ లక్ష్యమే లోకంగా అదే పనిలో మునిగిపోతారు. అలీగఢ్లో ఒక పేద కుటుంబంలో పుట్టిన రింకూ సింగ్ లాంటి వారు ఒకరోజు ఐపీఎల్ లాంటి క్రీడల్లో స్టార్లుగా అవతరిస్తారు.
24 ఏళ్ల రింకూ సింగ్ సాధించిన విజయం, మీ మనసులో లక్ష్యాలు దృఢంగా ఉంటే, ఆకాశాన్ని కూడా చీల్చుకుంటూ దూసుకెళ్లవచ్చని మరోసారి నిరూపిస్తుంది.
ఐపీఎల్లో సోమవారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో రింకూ సింగ్ బ్యాటింగ్కు వచ్చినప్పుడు, ఆయన జట్టు 44 బంతుల్లో 61 పరుగులు చేయాల్సి ఉంది. ఇదేమీ పెద్ద కష్టమైన లక్ష్యం కాదు. కాకపోతే పిచ్ పై బంతి భయంకరంగా స్పిన్ అవుతోంది. బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు.
క్రీజ్లోకి వచ్చిన రింకూ సింగ్కు ఇది ఐపీఎల్లో మూడో మ్యాచ్ మాత్రమే. రావడం రావడంతోనే ఫాస్ట్బౌలర్ ట్రెండ్ వేసిన బంతిని బౌండరీకి పంపడం ద్వారా తన దూకుడును రుచి చూపించారు రింకూ సింగ్.
అప్పటికే 31 పరుగులు చే సిన నితీశ్ రాణా మరో ఎండ్లో ఉన్నారు. అక్కడి నుంచి ఆయన రింకూ సింగ్ కు సపోర్టింగ్ రోల్లోకి మారిపోయారు. తనకు లభించిన అవకాశాన్ని రింకూ సింగ్ అద్భుతంగా వినియోగించుకున్నారు.
- షేన్ వార్న్: 'బాల్ ఆఫ్ ది సెంచరీ' కథ ఇదీ..
- 'మై లవ్, ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ' అంటూ ఇన్స్టాగ్రామ్లో అనుష్క శర్మ భావోద్వేగ పోస్ట్
రాణా-రింకూ భాగస్వామ్యం
ఐదు బంతుల మిగిలి ఉండగానే కోల్కతా నైట్ రైడర్స్ నితీశ్ రాణా కొట్టిన సిక్స్లో మ్యాచ్ గెలుచుకుంది. కానీ, రింకూసింగ్ మాత్రం క్రికెట్ అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ఆయన కేవలం 23 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో అజేయంగా 42 పరుగులు చేశారు.
కోల్కతా జట్టులో రింకూ సింగ్కు, నితీశ్ రాణా అత్యంత సన్నిహితుడు. ఈ ఇన్నింగ్స్లో నితీశ్ సహకారంతో ఆయన చాలా ప్రయోజనం పొందారు.
ఒత్తిడి నియంత్రించడంలో మంచి ప్రతిభ కనబరిచాడంటూ సునీల్ గావస్కర్ రింకూసింగ్ పై ప్రశంసలు కురిపించారు. ''రింకూసింగ్ ఫ్యూచర్ స్టార్. మొదటి మ్యాచ్ నుంచి తాను కొత్త ఆటగాడినన్న భావన ఆయనలో కనిపించలేదు'' అన్నారు గావస్కర్
- విరాట్ కోహ్లి: టెస్టుల్లో అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్కు ఈ తరహా వీడ్కోలు ఏంటి? దాని వెనక కారణమేంటి
- ఆస్ట్రేలియా బ్యాట్స్మన్పై అత్యాచారం.. 1985 టూర్ సమయంలో జరిగిందని ఆరోపణ
కోల్కతా నైట్ రైడర్స్తో ఐదేళ్ల ప్రస్థానం
ఐదేళ్లుగా కోల్కతా నైట్ రైడర్స్ తరఫున మ్యాచ్ ఆడటానికి ఎదురు చూసినట్లు హర్షాభోగ్లేతో ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన ఐదేళ్లుగా పెట్టుకున్న ఆశలు అడియాశలు కాలేదు. ఆయన నిరంతర శ్రమ ఫలితంగా ఈ స్థాయికి చేరారు. 2018 సంవత్సరం నుండి కోల్కతా నైట్ రైడర్స్తో జట్టులో కొనసాగుతున్నారు రింకూ సింగ్. ఈ సీజన్కు ముందు కూడా 10 మ్యాచ్ల్లో అవకాశం వచ్చినా పెద్దగా రాణించలేకపోయారు. అయినా కోల్కతా జట్టు ఆయనను వేలంలో 55 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది.
కానీ, ఈసారి ఆయన ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మొదటి మ్యాచ్లో 35 పరుగులు చేయడంతో పాటు నాలుగు క్యాచ్లు అందుకోవడం ద్వారా తన సత్తాను చాటారు. ఆ తర్వాత సోమవారంనాటి రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ సందర్భంగా భారీ లక్ష్యం, ఒత్తిడి మధ్య ఆడి జట్టును గెలిపించారు.
కోల్కతా నైట్ రైడర్స్ ఐదు పరాజయాల పరంపరను కూడా అతని ఇన్నింగ్స్ బద్దలు కొట్టింది. ఇప్పుడు రానున్న మ్యాచ్లలో రింకు సింగ్ పై అంచనాలు పెరిగి పోయాయి.
https://twitter.com/KKRiders/status/1521201049138171904
నిరుపేద కుర్రాడు స్టార్గా మారిన కథ
అలీగఢ్లోని గ్యాస్ విక్రేత ఐదుగురు కుమారులలో ఒకరైన రింకూ సింగ్ స్కూల్ రోజుల నుంచి క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. కోల్కతా నైట్ రైడర్స్ వెబ్సైట్లో ఆయన తన కెరీర్ గురించి చెబుతున్న వీడియో ఒకటి ఉంది. అందులో "నేను ఆటలతో టైమ్ వేస్ట్ చేయడం నాన్నకు ఇష్టం ఉండేది కాదు. ఒక్కోసారి నన్ను కొట్టేవారు. ఇంటికి ఎప్పుడు వస్తానా కర్రపట్టుకుని ఎదురు చూసేవారు'' అని పేర్కొన్నారు.
అన్నదమ్ములందరూ కలిసిపోయేవారమని, బంతి కొనడానికి కూడా డబ్బులు ఉండేవి కావని, ఎవరో ఒకరి సహాయంతో బాల్ కొనుక్కునే వాళ్లమని రింకూ సింగ్ చెప్పారు.
రింకూ సింగ్ తన అద్భుతమైన ఆటతీరుకు బహుమతిగా ఒక మోటార్సైకిల్ను బహుమతిగా పొందిన టోర్నమెంట్ కూడా ఉంది. ఆ మోటార్ సైకిల్ ను ఆయన తన తండ్రికి బహుమతిగా ఇచ్చారు.
అలీగఢ్లో వ్యాపారుల ఇళ్లకు, షాపులకు గ్యాస్ సిలిండర్లను రవాణా చేయడానికి అవసరమైన మోటార్ సైకిల్ను తాను కొనలేకపోయినా, తన కొడుకు క్రికెట్ ద్వారా సంపాదించాడని ఆ తండ్రి సంతోషించారు. అప్పటి నుంచి క్రికెట్ ఆడినందుకు రింకూసింగ్కు దెబ్బలు తగ్గాయి. కానీ, కుటుంబపు ఆర్ధిక సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి.
ఒకరోజు ఉపాధి కోసం వెతుకుతున్న ఆయనకు చిన్న ఉద్యోగం దొరికింది. "నాకు ఒక కోచింగ్ సెంటర్లో గదులు తుడిచే ఉద్యోగం వచ్చింది. నాకు అది ఇష్టం లేదు. కానీ, నేను ఎక్కువ చదువు కోలేదు. అప్పుడే నేను క్రికెట్పై దృష్టి పెట్టాలని భావించాను. క్రికెట్ మాత్రమే నన్ను ముందుకు తీసుకెళ్లగలదు అనుకున్నాను. అంతకు మించి నాకు వేరే మార్గం లేదని భావించేవాడిని'' అని రింకూ సింగ్ చెప్పారు.
కానీ, అనుకున్నట్లుగా క్రికెట్లో ఎంట్రీ అంత సులభం కాలేదు. అండర్-16 ట్రయల్స్లో రింకూ సింగ్కు ఏం చేయాలో తెలియక, రెండుసార్లు మొదటి రౌండ్ లోనే వెనుదిరగాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో అలీగఢ్కు చెందిన మహ్మద్ జీషన్ రింకూకు సాయం చేశారు.
రింకూ సింగ్ ఐపీఎల్ క్రికెటర్గా మారడానికి ముగ్గురు ముస్లింలు సహకరించారు. మొదట్లో అలీగఢ్కు చెందిన మసూద్ అమీన్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. నేటికీ ఆయనే కోచ్గా వ్యవహరిస్తున్నారు. అలాగే మహమ్మద్ జీషన్ నుంచి సహాయం పొందానని రింకూ సింగ్ చెప్పారు.
https://twitter.com/KKRiders/status/1519896758754574338
గుర్తింపు మొదలైన వేళ
మూడవ వ్యక్తి షారుక్ ఖాన్. కోల్కతా నైట్ రైడర్స్ రింకూసింగ్ను 2018లో రూ.80 లక్షలకు కొనేందుకు సిద్ధపడింది. అప్పట్లో రింకూ సింగ్ అంటే ఎవరో చాలామందికి తెలియదు. ఉత్తర్ప్రదేశ్ తరపున దేశవాళీ క్రికెట్లో ఆయన అప్పుడప్పుడే ఎదుగుతున్న సమయంలో కోల్కతా నైట్ రైడర్స్ దృష్టి పడింది.
''అలీగఢ్ నుంచి ఐపీఎల్ కు ఎంపికైన మొదటి వ్యక్తినయ్యాను. కొంత డబ్బు సంపాదించాను. మా కుటుంబానికి సొంత ఇల్లు ఉండేది కాదు. ఇప్పుడా సమస్య లేదు. అప్పులు కూడా తీర్చేశాను'' అన్నారు రింకూ సింగ్
ఇదంతా జరిగింది కానీ, ఇన్నాళ్లూ అసలు అద్భుతం మాత్రం ఇంకా జరగలేదు. ఐపీఎల్లో తన ఆటతో ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసే సమయం కోసం ఆయన వేచి చూడాల్సి వచ్చింది. కానీ సీజన్లు దొర్లిపోతున్నా అవకాశాలు పెద్దగా రాలేదు. వచ్చినా వాటిని వినియోగించుకోలేకపోయారు.
అయితే, ఇప్పుడు ఆ అద్భుతాలను ప్రదర్శించేందుకు రింకూ సింగ్ సిద్ధమైనట్లు కనిపిస్తున్నారు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన రింకూ, ఏదో ఒక రోజున భారత్ తరఫున క్రికెట్ ఆడాలని కలలు కంటున్నారు. అయితే, దాని కోసం ఆయన ఐపీఎల్, దేశీయ క్రికెట్లలో తన ప్రతిభను ప్రదర్శించాల్సి ఉంది.
రింకు సింగ్ 2016 నుంచి ఉత్తర్ప్రదేశ్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పాల్గొంటున్నారు. ఐదు సెంచరీలు, 6 అర్ధ సెంచరీల సహాయంతో 2307 పరుగులు చేశారు.
ఇవి కూడా చదవండి:
- భారత ప్రధాని మోదీని పాకిస్తానీయులు ఎందుకు పొగుడుతున్నారు? ఆయన పాత వీడియో ఎందుకు వైరల్ అవుతోంది?
- కిచిడీలో ఉప్పు ఎక్కువైందని భార్యను చంపేశాడు... చిన్న చిన్న కారణాలతో ఎందుకీ దారుణాలు?
- మహిళలకు పీరియడ్స్ లీవ్ ఇవ్వాలా వద్దా.... దీని చుట్టూ ఉన్న వివాదమేంటి?
- యుక్రెయిన్ యుద్ధం: భారత్లో వంటనూనెకు కొరత తప్పదా?
- తాన్సేన్ సమాధి మీద మొలిచిన బెర్రీ చెట్టు ఆకులు తింటే గొంతు మధురంగా మారుతుందా?
- సర్కారు వారి పాట: మహేశ్ బాబు నోట వైఎస్ జగన్ డైలాగ్.. 'నేను విన్నాను.. నేను ఉన్నాను’పై సోషల్ మీడియాలో చర్చ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)