Lalu Prasad Yadav : లాలూ తాజా హెల్త్ బులిటెన్ విడుదల-ఫోన్లో మోడీ-నేరుగా నితీశ్ పరామర్శ
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాజకీయ కురువృద్ధుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్దితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు. దాణా కుంభకోణం కేసుల్లో దోషిగా తేలిన లాలూ ప్రసాద్ యాదవ్ జైలు శిక్ష అనుభవిస్తూ రెండు నెలల క్రితమే బెయిల్పై విడుదల అయ్యారు. అయితే అనారోగ్య సమస్యలతో భాదపడుతున్న ఆయన చికిత్స కోసం విదేశాలకు వెళ్లాలనుకునే సమయంలో అనుకోకుండా కాలుజారిపడ్డారు.
ప్రస్తుతం పట్నాలోని పరాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లాలూను వైద్యులు నిశితంగా పరీక్షిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్ధితిని ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నారు. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, లాలూ ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్కు ఫోన్ చేసి ఆయన యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
లాలూ వేగంగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. మరోవైపు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్వయంగా వెళ్లి తన పాతమిత్రుడిని పరామర్శించారు. ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉందని తనయుడు తేజస్వి యాదవ్ ప్రకటించారు. కిడ్నీ, గుండె సంబంధిత సమస్యల కోసం ఢిల్లీకి షిఫ్ట్ చేసినట్లు వెల్లడించారు.
లాలూ ప్రసాద్ యాదవ్ సోమవారం తెల్లవారుజామున ఇంట్లో మెట్లపై నుంచి కాలుజారి పడిపోయారు. దీంతో ఆయన కుడి భుజానికి గాయమైంది . ఆయన్ను వెంటనే పాట్నాలోని పరాస్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. భార్య రబ్రీదేవితో పాటు లాలూ ఇద్దరు కుమారులు తేజస్వీ యాదవ్, సూర్యప్రతాప్ యాదవ్ ఆయనతో పాటే ఉన్నారు. కుడి భుజం గాయంతో పాటు లాలూ కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు.