సినిమా ఫక్కిలో 16 కేజీల బంగారు లూటీ
బెంగళూరు: ప్రసిద్ది చెందిన మణప్పురం గోల్డ్ లోన్ కార్యాలయంలోకి చొరబడిన దుండగులు కళ్లలో కారం చల్లి బంగారు, నగదు లూటీ చేసిన సంఘటన బెంగళూరు నగరంలో జరిగింది. 16 కేజీల బంగారు నగలతో పాటు, నగదు లూటీ చేసి దర్జాగా షిఫ్ట్ కారులో పరారైనారు.
జ్ఞానభారతి పోలీస్ స్టేషన్ పరిధిలోని మరియప్పనపాళ్య సమీపంలోని జ్ఞానగంగా నగరలో మణప్పురం గోల్డ్ లోన్ కార్యాలయం ఉంది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో కార్యాలయంలో ఇద్దరు మహిళలతో సహా నలుగురు సిబ్బంది మాత్రమే ఉన్నారు.
ఆ సందర్బంలో ఖాతాదారులు ఎవ్వరు లేరు. విషయం పసిగట్టిన నలుగురు దుండగులు మంకీ క్యాప్ లు వేసుకుని లోపలికి చొరబడ్డారు. కార్యాలయంలో ఉన్న నలుగురు సిబ్బంది కళ్లలో కారం కొట్టారు. కేకలు వేస్తే ప్రాణాలు తీస్తామని నలుగు గొంతుల మీద కత్తులు పెట్టారు.

ఒకరు ఎదురు తిరగడంతో కత్తితో అతని మీద దాడి చేశారు. మిగిలిన ముగ్గురు ప్రాణభయంతో ఎదురు తిరగలేదు. తరువాత నిందితులు లాకర్ లో ఉన్న 16 కేజీల బంగారు నగలు, రూ. 1.50 లక్షలు (నగదు) లూటీ చేసి అక్కడి నుంచి జారుకున్నారు.
మణప్పురం గోల్డ్ లోన్ కార్యాలయం రెండవ అంతస్తు మీద ఉన్న కారణంగా ఈ విషయాన్ని స్థానికులు గుర్తించలేకపోయారు. విషయం తెలుసుకున్న అడిషనల్ పోలీసు కమిషనర్ ప్రతాప్ రెడ్డి, జాయింట్ పోలీసు కమిషనర్ చంద్రశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
గాయాలైన సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు. ఈ కార్యాలయంలో సెక్యూరిటి సిబ్బంది లేరని, నిందితులు షిఫ్ట్ కారులో పారిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయని, ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications