షాకింగ్: భారీ మొత్తంలో కరెన్సీ మాయం, ఆర్టీఐ ద్వారా వెలుగులోకి, అందుకేనా నోట్లరద్దు?
న్యూఢిల్లీ: వెయ్యి, రెండు వేలు కాదు... ఏకంగా 23 వేల కోట్ల రూపాయలు ప్రింట్ అయితే అయ్యాయి కానీ, అవి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)కి చేరుకోలేదు. ఆ తరువాత కొంతకాలానికే నోట్ల రద్దు జరిగింది. మరి ఆ రూ.23 వేల కోట్లు ఏమైనట్లు?
దీనిపై సమాచార హక్కు కార్యకర్త మనోరంజన్ రాయ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)తో విస్తుపోయే ఈ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన దాఖలు చేసిన 'పిల్'ను సరిగ్గా పరిశీలించకుండానే కోర్టు కొట్టివేసింది. దీంతో రివ్యూ పిటిషన్ వేశారు. ఈ రివ్యూ పిటిషనే సోమవారం బాంబే హైకోర్టు ముందుకు విచారణకు రానుంది.
సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి...
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెద్దనోట్లు రద్దు చేయడానికి ముందు రూ.23 వేల కోట్ల రూపాయల కరెన్సీ ముద్రణ జరిగింది కానీ ఆ నోట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చేరలేదు. నోట్ల ముద్రణ, సరఫరాకు సంబంధించి ఓ సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద దాఖలు చేసిన దరఖాస్తుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇటు ప్రింటింగ్ ప్రెస్లు, అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఆర్టీఐకి సమర్పించిన డేటా ద్వారా ఆ భారీ కరెన్సీ నోట్ల మాయం సంగతి బయటికొచ్చింది.
Recommended Video
రూ.23,465 కోట్ల విలువైన కరెన్సీ గాయబ్...
ప్రింటింగ్ ప్రెస్లు ముద్రించిన దేశీయ కరెన్సీ నోట్ల గణాంకాలను ఆర్బీఐ విడుదల చేసింది. ఈ వివరాల్లో ప్రింటింగ్ ప్రెసలు రూ.500 డినామినేషన్ గల 19,45,40,00,000 పీస్ల కరెన్సీ నోట్లను ఆర్బీఐకి పంపినట్లు ఉంది. కానీ ఆర్బీఐ మాత్రం తాను కేవలం 18,98,46,84,000 పీసుల నోట్లు మాత్రమే తనకు చేరిన్లు పేర్కొంది. అంటే రూ.23,465 కోట్ల విలువైన 46,93,16,000 పీసుల నోట్లు మాయమైపోయాయి.
ప్రింటింగ్ ప్రెస్లు వర్సెస్ ఆర్బీఐ, ఎవరిది నిజం?
ఆర్టీఐకి సమర్పించిన డేటాలో రూ.1000 డినామినేషన్ గల 4,44,13,00,000 పీస్ల కరెన్సీ నోట్లను ఆర్బీఐకి పంపించినట్టు ప్రింటింగ్ ప్రెస్లు పేర్కొన్నాయి. కానీ ఆర్బీఐ సమర్పించిన డేటాలో మాత్రం తాను 4,45,30,00,000 పీస్ల కరెన్సీ నోట్లను అందుకున్నట్టు పేర్కొంది. అంటే ప్రింటింగ్ ప్రెస్ల నుంచి రూ.1,170 కోట్లు అత్యధికంగా ఆర్బీఐ పొందింది. ఈ లెక్కలు సరియైనవిగా లేవు. మరో ఆర్టీఐ డేటాలో 2000-2011 వరకు భారతీయ రిజర్వు బ్యాంకు నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.500 డినామినేషన్ కలిగిన 13,35,60,00,000 పీసులను, రూ.1000 డినామినేషన్ కలిగిన 3,35,48,60,000 పీసులను ఆర్బీఐకి పంపినట్టు పేర్కొంది. కానీ ఈ నోట్లు అసలు తనకు చేరనేలేదని ఆర్బీఐ పేర్కొంది.
2015లోనే పిల్ వేసిన మనోరంజన్ రాయ్...
ఆర్టీఐకి అందిన సమాచారం మేరకు... దేశంలో కరెన్సీ నోట్ల ముద్రణ, సరఫరాలో భారీగా అవకతవకలు జరిగిన విషయం అర్థమవగానే సమాచారహక్కు కార్యకర్త మనోరంజన్ రాయ్ ప్రధానమంత్రి, ఆర్థికమంత్రి, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలను బాధ్యులుగా చేస్తూ 2015లో బాంబే హైకోర్టులో ఒక ప్రజాప్రయోజన వ్యాఖ్యాన్ని దాఖలు చేశారు. ఇందుకు ప్రతిగా 2016 జనవరి 27న అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనిల్ సింగ్ హైకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో ప్రధానమంత్రి, ఆర్థికమంత్రి, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖల పేర్లను ఈ వ్యాజ్యంలోంచి తొలగించాలని కోరారు.
అందుకేనా ‘నోట్లరద్దు' ప్రకటించింది?
ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ‘సరైన పరిశీలన లేకుండా' 2016 ఆగస్టు 23న జస్టిస్ వీఎం కనడే, జస్టిస్ స్వప్నా ఎస్ జోషి కొట్టివేశారు. దీంతో 2016 సెప్టెంబర్ 22న సమాచార హక్కు కార్యకర్త మనోరంజన్ రాయ్ దీనిపై రివ్యూ పిటిషన్ వేశారు. అయితే రాయ్ ముందు వేసిన పిటిషన్ను కొట్టివేసిన 75 రోజుల్లోనే ప్రధాని నరేంద్రమోడీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దేశంలో అవినీతికి వ్యతిరేకంగా, ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి కరెన్సీనోట్లు రద్దు చేసినట్లు పైకి చెబుతున్నా.. దేశంలో వేల కోట్ల రూపాయల కరెన్సీ మాయమైపోవడమే అసలు కారణమనేది రాయ్ ఆరోపణ. ఈ నేపథ్యంలో మనోరంజన్ రాయ్ రివ్యూ పిటిషన్ సోమవారం బాంబే హైకోర్టు ముందు విచారణకు రానుంది.