రూ. 3 కోట్లు చోరీ కేసు, పోలీసుల అదుపులో కాంగ్రెస్ పార్టీ లేడీ లీడర్, పక్కా ప్లాన్, లూటీ!
బెంగళూరు: ఇంటిలో ఎవ్వరూ లేని సమయంలో రూ. 3 కోట్లు లూటీ అయిన కేసులో కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ప్రముఖ నాయకురాలిని బెంగళూరు సిటి క్రైం బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు బుధవారం (ఆగస్టు 22) అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నాయకురాలు కేటీ. వీణా రూ. 3 కోట్ల చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
కర్ణాటక 2018 శాసన సభ ఎన్నికల సందర్బంలో గదగ్ నుంచి పోటీ చేసిన అనీల్ మెణసినకాయి (అనీల్ మిరపకాయి) ఆయన దగ్గర ఉన్న రూ. 3 కోట్లు మీకు తెలిసిన వారి ఇంటిలో పెట్టాలని స్నేహితుడు హరిప్రసాద్ కు ఇచ్చారు.
హరిప్రసాద్ బెంగళూరు నగరంలోని రాజాజీనగర్ లో నివాసం ఉంటున్న సోదరి సరోజ ఇంటిలో రూ. 3 కోట్లు పెట్టారు. సరోజ, కాంగ్రెస్ పార్టీ లేడీ లీడర్ కేటీ. వీణా బంధువులు. సరోజ ఇంటికి వీణా అప్పుడప్పుడు వచ్చి వెలుతుంటారు.
ఒక సందర్బంలో తన అన్న హరిప్రసాద్ రూ. 3 కోట్లు తీసుకు వచ్చి ఇంటిలో పెట్టారని సరోజ కేటీ. వీణాకు చెప్పింది. తరువాత రెండు మూడు సార్లు వీణా సరోజ ఇంటికి వెళ్లి వచ్చారు. కొన్ని రోజుల క్రితం సరోజ ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో సరోజ ఇంటిలో ఉన్న రూ. 3 కోట్ల నగదు చోరీ అయ్యింది.
ఇంటిలో నగదు చోరీ అయ్యిందని గుర్తించిన సరోజ రాజాజీనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజాజీనగర పోలీసులు కేసు నమోదు చేశారు భారీ మొత్తంలో నగదు చోరీ కావడంతో కేసు బెంగళూరు సీసీబీ పోలీసులకు అప్పగించారు.
పోలీసుల విచారణలో తనకు కేటీ. వీణా మీద అనుమానం ఉందని, ఆమెకు మాత్రం రూ. 3 కోట్లు ఉన్న విషయం తెలుసు అని సరోజ పోలీసుల సమాచారం ఇచ్చారు. నటరాజ్, బాబు అనే ఇద్దరు వ్యక్తులను సరోజ ఇంటికి కేటీ. వీణా పంపించి రూ. 3 కోట్లు చోరీ చేయించారని ఆరోపణలు ఉన్నాయి. కేసు విచారణలో ఉంది.