బ్యాంక్ దోపిడీ: తుపాకీ పెట్టి 30లక్షలు ఎత్తుకెళ్లారు
పాట్నా: బీహార్ రాష్ట్రంలోని నలందా జిల్లాలో భారీ దోపిడీ జరిగింది. సిబ్బందిని తుపాకీతో బెదిరించి ఓ జాతీయ బ్యాంకు బ్రాంచి నుంచి రూ. 30లక్షలను దుండగులు ఎత్తుకెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఎస్పీ వివేకానంద్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక సోహ్సరై పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ జాతీయ బ్యాంకు బ్రాంచిలోకి శుక్రవారం ముగ్గురు ఆగంతకులు చొరబడ్డారు. బ్యాంకు సిబ్బందిపై దాడి చేసి తుపాకీతో బెదిరించారు.
అనంతరం డబ్బు తీసుకుని దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. బ్యాంకు నుంచి రూ. 30లక్షల వరకు దుండగులు ఎత్తుకెళ్లినట్లు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని, నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
దేశ రాజధానిలో గురువారం ఏటిఎంలో డబ్బులు పెట్టే వాహనం నుంచి రూ. 22.5కోట్లతో డ్రైవర్ పరారైన విషయం తెలిసిందే. విస్తృతంగా గాలింపు జరిపిన పోలీసులు శుక్రవారం ఉదయం నిందితుడ్ని పట్టుకున్నారు. అపహరణకు గురైన మొత్తం సొమ్మును అతడినుంచి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.