రూ. 50 లక్షల ఏటీఎం నగదు మాయం
బెంగళూరు: ఏటీఎంలో నిల్వ చెయ్యడానికి తీసుకు వెళ్లిన నగదు మాయమైన సంఘటన బెంగళూరు నగరంలో సంచలనం కలిగించింది. పట్టపగలు నిత్యం రద్దీగా ఉండే ఎంజీ రోడ్డులో ఈ నగదు మాయం కావడంతో బ్యాంకు సిబ్బంది హడలిపోయారు.
బుధవారం మద్యాహ్నాం నగరంలోని ఎంజీ రోడ్డులో ఉన్న ఇండస్ ఇండ్ బ్యాంకు ఏటీఎంలో నగదు నిల్వ చెయ్యడానికి వెళ్లారు. ఏటీఎం వ్యాన్ లో రూ. 50 లక్షలకు పైగా నగదు ఉంది. నగదు నిల్వ చెయ్యడానికి వెళ్లిన వారిలో మహేష్ అనే యువకుడు ఉన్నాడు.
అయితే వ్యాన్ డ్రైవర్, సెక్యూరిటి సిబ్బంది కళ్లు గప్పిన మహేష్ రూ. 50 లక్షలతో అక్కడి నుంచి పరారైనాడు. తీరా విషయం తెలుసుకున్న సెక్యూరిటి సిబ్బంది బ్యాంకు అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసు అధికారులు అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. మహేష్ బెంగళూరు నగరం దాటి పారిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలాగైనా అతనిని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే మహేష్ ఏ ప్రాంతానికి చెందిన వాడు, ఎంత కాలం నుంచి పని చేస్తున్నాడు అని పోలీసులు ఆరా తీస్తున్నారు.