మళ్లీ... ఆరెస్సెస్ చీఫ్ సంచలనం, ఇద్దరని డిగ్గీ కౌంటర్
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భారత్ ముమ్మాటికి హిందూ రాజ్యమేనని, హిందుత్వ అనేది భారత్ ఐడెంటిటీ అని వ్యాఖ్యానించారు. ఇంగ్లండ్ దేశంలో ఉన్నవాళ్లను ఇంగ్లీష్ వాళ్లని, అమెరికాలో ఉండేవారిని అమెరికన్స్ అని, జర్మనీలో ఉండేవారిని జర్మన్స్ అని పిలుస్తున్నప్పుడు, హిందుస్థాన్లో ఉంటున్నవారిని హిందువులు అని పిలిస్తే తప్పేంటన్నారు.
వీహెచ్పీ సంస్థ ఏర్పాటై 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముంబైలో జరిగిన ఓ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారతదేశం హిందూ రాజ్యమని, హిందుత్వమనేది దాని గుర్తింపని, హిందుత్వం దేశంలోని అన్ని మతాలను తనలో ఇముడ్చుకుందన్నారు. గతంలోను మోహన్ భగవత్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.
దిగ్విజయ్ స్పందన
భారత్ ఓ హిందూ దేశమని మోహన్ భగవత్ పునరుద్ఘాటించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ స్పందించారు. ఆరెస్సెస్ చీఫ్ ఓ నియంత అని ట్వీట్ చేశారు. సంఘ్ పరివార్ ఇకనైనా అమాయక ప్రజలను మోసగించడం మానుకోవాలన్నారు. మనకు ఒకడే హిట్లర్ ఉన్నాడని భావించేవాడినని కానీ, ఇద్దరున్నట్టు తెలుస్తోందని, ఇక దేశాన్ని ఆ దేవుడే కాపాడాలి!! అని ట్వీట్ చేశారు.
ఓ ప్రశ్న కూడా సంధించారు. హిందుత్వ ఓ మతపరమైన గుర్తింపు అయితే, దానికీ, సనాతన ధర్మానికీ ఉన్న సంబంధమేంటో చెప్పాలన్నారు. ఇస్లాం, క్రైస్తవం, సిక్కు, బుద్ధిజం, జైనిజం... ఇలా ఏదైనా ఓ మతాన్ని నమ్మే వ్యక్తి హిందువు అవుతాడా? దీనికి మోహన్ భగవత్ స్పష్టత ఇస్తారా? అని ప్రశ్నించారు.