ఆరెస్సెస్ సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్ గా జాతీయ పతాకం- 52 ఏళ్ల విమర్శలకు చెక్
భారత్ 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్న వేళ.. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని వెనుక నుంచి నడిపిస్తున్న విమర్శలు ఎదుర్కొంటున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) తన సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్ చిత్రాలను సాంప్రదాయ కాషాయ జెండా నుండి జాతీయ జెండాగా మార్చింది.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశం 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'ను జరుపుకుంటున్నందున ఆగస్టు 2 నుంచి ఆగస్టు 15 వరకూ తమ సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్ పిక్చర్గా త్రివర్ణ పతాకం పెట్టుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే దేశప్రజలను కోరారు. అయితే ఆరెస్సెస్ మాత్రం ఈ సూచన పాటించకపోవడంతో విమర్శలు వచ్చాయి. అధికార బీజేపీ రాజకీయ మూలాధారమైన ఆరెస్సెస్.. జాతీయ జెండాను కాదని కాషాయ జెండాకే కట్టుబడుతోందని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆరెస్సెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
52 ఏళ్లుగా నాగ్పూర్లోని ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేయని సంస్థ త్రివర్ణ పతాకాన్ని సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్ పిక్ గా పెట్టుకుంటుందా, ప్రధాని సందేశాన్ని పాటిస్తుందా అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆరెస్సెస్ ను తాజాగా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆర్ఎస్ఎస్ ప్రచార విభాగం కో-ఇన్చార్జి నరేందర్ ఠాకూర్ మాట్లాడుతూ సంఘ్ తన అన్ని కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటుందని తెలిపారు. కేంద్రం పిలుపునిచ్చిన 'హర్ ఘర్ తిరంగ' ప్రచారంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చురుకుగా పాల్గొంటున్నారని ఆయన అన్నారు.
అనంతరం సంఘ్ సోషల్ మీడియాలో తన ప్రొఫైల్ చిత్రాన్ని తన సంస్థాగత జెండా నుండి జాతీయ జెండాగా మార్చింది. కేంద్ర ప్రభుత్వం తన 'హర్ ఘర్ తిరంగ' కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 13-15 తేదీలలో తమ ఇళ్ల నుండి జాతీయ జెండాను ఎగురవేయాలని లేదా ప్రదర్శించాలని ప్రజలను కోరింది. అంతకుముందు ఆర్ఎస్ఎస్ ప్రచార విభాగం ఛీఫ్ సునీల్ అంబేకర్ మాట్లాడుతూ ఇలాంటి వాటిని రాజకీయం చేయవద్దని అన్నారు. ఆర్ఎస్ఎస్ ఇప్పటికే 'హర్ ఘర్ తిరంగ', 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' కార్యక్రమాలకు తన మద్దతు ఇచ్చింది. ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు, సంఘ్ సంబంధిత సంస్థలు నిర్వహించే కార్యక్రమాలకు ప్రజలు, స్వయంసేవకుల పూర్తి మద్దతు, భాగస్వామ్యం కోసం జూలైలో సంఘ్ విజ్ఞప్తి చేసినట్లు సునీల్ అంబేకర్ తెలిపారు.