నటి మైత్రేయి కేసు: కార్తిక్ ముందస్తు బెయిల్ పిటిషన్
బెంగళూర్: తనపై నటి మైత్రేయి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రైల్వే మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తిక్ గౌడ స్థానిక సివిల్ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కార్తిక్పై నటి మైత్రేయి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అతనిపై అత్యాచారం కింద కేసు నమోదైంది.
కాగా, శుక్రవారంనాడు మైత్రేయిని పోలీసులు ఆరు గంటల పాటు విచారించారు. ఆమె చెప్పిన వివరాలను నమోదు చేసుకున్నారు. బుధవారం సదానంద తనయుడికి నిశ్చితార్థం జరుగుతున్న సమయంలో మైత్రేయి బెంగళూరులో తీవ్ర ఆరోపణలు చేసిన విషం తెలిసిందే. తనను కార్తీక్ గౌడ పెళ్లి చేసుకున్నాడని, తనను మోసం చేసి మరో యువతితో నిశ్చితార్థం జరుపుకుంటున్నారని ఆరోపించారు. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిని సదానంద కుట్రగా అభివర్ణించారు.
తన కుమారుడు అలాంటి పనులు చేయడన్నారు. ఒకవేళ చేసినట్లు రుజువైతే శిక్షించవచ్చునన్నారు. తన పైన నమోదైన ఆరోపణలను కార్తీక్ కూడా ఖండించారు. మరోవైపు, భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో డీఎంకే అధ్యక్షులు కరుణానిధి కుమారుడు, ఆ పార్టీ మాజీ నేత ఎంకే అళగిరిపై మధురై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఫిర్యాదులో.. మధురైలో అళగిరికి చెందిన 'దయ ఇంజనీరింగ్ కాలేజ్' బయట 44 సెంట్ల భూమి ఉంది. దాన్ని నకిలీ పత్రాలతో కళాశాల వారు ఆక్రమించుకున్నారని ఆరోపించారని పోలీసులుతెలిపారు. అళగిరిని అరెస్టుచేసే అవకాశం ఉందంటున్నారు. అటు ఆయనపై చేస్తున్న ఆరోపణలు రాజకీయంగా ప్రేరేపించినవేనని సన్నిహితులు అంటున్నారు.