మోడీ 'మన్ కీ బాత్': పర్యావరణం, తమిళ వరదలు
న్యూఢిల్లీ: పర్యావరణ మార్పుల వల్ల ప్రపంచదేశాలు ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయని ప్రధాని మోడీ అన్నారు. ఆదివారం ప్రధాని మోడీ 'మన్ కీ బాత్' కార్యక్రమంలో వివిధ అంశాలపై దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. భూతాపం అతి పెద్ద సమస్యగా మారిందని వ్యాఖ్యానించారు.
భూ ఉష్ణోగ్రతలు పెరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పర్యావరణ మార్పులపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పంటలు కోసిన తర్వాత పొలాల్లో మిలిగిన వాటిని తగులబెట్టడం వల్ల కాలుష్యం పెరుగుతోందని, ఇలా చేయొద్దని రైతులకు సూచించారు. దీనిపై రైతులకు శిక్షణ ఇవ్వాలన్నారు.
పర్యావరణ మార్పుల వల్లే అతివృష్టి, అనావృష్టి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ప్రధాని అన్నారు. సోలార్ ఎనర్జీపై దేశ ప్రజలు దృష్టి పెట్టాలన్నారు. సౌర విద్యుత్తును ఎక్కువగా ఉపయోగించుకోవాలన్నారు. పున్నమి రోజుల్లో వీధి దీపాల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు.

ఈ దిశగా కృషి చేస్తోన్న బిల్ గేట్స్ ఫౌండేషన్పై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. భారీ వర్షాలతో అతలాకుతలమైన తమిళనాడును అన్నివిధాలా ఆదుకుంటామని ప్రధాని మోడీ హామీయిచ్చారు. పండుగ సమయంలో తమిళనాడును వర్షాలు ముంచెత్తడం బాధాకరమని అన్నారు. మృతులకు సంతాపాన్ని తెలియజేశారు.
విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నేపాల్లో భూకంపం సంభవించిన తర్వాత విపత్తు సన్నద్ధతకు కలిసి రావాలని సార్క్ దేశాలను కోరినట్టు ఆయన తెలిపారు. నేపాల్లో భూకంపం వచ్చినప్పుడు పాక్ ప్రధానితో మాట్లాడినట్లు చెప్పారు.
ఇక నవంబర్ 27న అవయవదాన దినోత్సవం జరుపుకొన్నామన్నారు. అవయవదానంతో విలువైన ప్రాణాలు కాపాడొచ్చని చెప్పారు. అవయవదానం చేసిన వారికి మరణం లేదని, వారు అమరజీవులుగా మిగులుతారన్నారు. అవయవదానంపై నినాదం, దాతల గుర్తింపుకార్డు, లోగో తదితరాలపై జాతీయ స్థాయిలో పోటీ నిర్వహిస్తున్నామన్నారు.
గత ప్రసంగంలో తాను అవయవదానం గురించి మాట్లాడడంతో నొటో(ఎన్ఓటీటీఏ) హెల్ప్ లైన్ కు కాల్స్ పెరిగాయని వెల్లడించారు. నొటో వెబ్ సైట్ కు హిట్స్ 2.5 రెట్లు పెరిగాయన్నారు. డిసెంబర్ 3న వికలాంగుల దినోత్సవం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వికలాంగులు ఎవరికీ తీసిపోరని, వారు సూర్ఫిప్రదాతలని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications