అఖిలేష్ సీఎం అభ్యర్థి, ఇక గొడవల్లేవ్: తగ్గిన ములాయం, కొడుకుదే పైచేయి
లక్నో: సమాజ్ వాది పార్టీలో ముసలం ముగిసిపోయింది. తండ్రి ములాయం సింగ్ యాదవ్, కొడుకు అఖిలేష్ యాదవ్ ఒక్కటయ్యారు. ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్ పేరును ములాయం సోమవారం సాయంత్రం ప్రకటించారు.
తిరగబడినా నా కొడుకే కదా: ములాయం, 'కొంతమంది'పై అసహనం
ఈ సందర్భంగా ములాయం మాట్లాడారు. సమాజ్ వాది పార్టీ విడిపోయేది లేదని తేల్చి చెప్పారు. త్వరలో ప్రచారం ప్రారంభిస్తానన్నారు. పార్టీలో అందరం కలిసే ఉంటామని చెప్పారు. అందరం కలిసే ప్రత్యర్థులను ఎదుర్కొంటామన్నారు. పార్టీలో ఎలాంటి విభేదాలు ఇక ఉండవని చెప్పారు. రేపు (మంగళవారం) అఖిలేష్ - ములాయం భేటీ కానున్నారు.
పార్టీలో ఐక్యత కోసం ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. సమాజ్వాదీ పార్టీ ముక్కలయ్యే ప్రశ్నేలేదన్నారు. కాగా, ఇటీవల సమాజ్వాదీ పార్టీలో, ములాయం కుటుంబంలో విభేదాలు, అంతర్గత కలహాలు పెద్దఎత్తున చెలరేగిన విషయం తెలిసిందే.
తండ్రీ కొడుకుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరడంతో ఆ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. దీంతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇరువర్గాలు సై అంటూ పార్టీ గుర్తు కోసం ఈసీని ఆశ్రయించాయి. ఇప్పుడు సమస్య ముగిసిపోయినట్లుగా ప్రకటించారు. ఇదిలా ఉండగా, ములాయం పైన అఖిలేష్ యాదవ్ పై చేయి సాధించినట్లుగా కనిపిస్తోంది.