ఇండియాలో రాజధాని, వందేభారత్కన్నా వేగంగా వెళ్లే ఏకైక రైలు
మనదేశంలో రాజధాని, శతాబ్ధి, తేజస్, వందేభారత్ లాంటి లగ్జరీ రైళ్లు నడుస్తుంటాయి. వీటిల్లో ఛార్జీలు కూడా చాలా అధికం. అందుకు తగ్గట్లుగానే అవి వేగంగా ప్రయాణిస్తుంటాయి. ఈ తరహాలోనే నడిచే రైలు ఒకటి మనదేశంలో ఉంది. దీన్ని కామన్ మ్యాన్ రాజధాని ఎక్స్ ప్రెస్ అని పిలుస్తుంటారు. ఛార్జీలు మాత్రం ప్యాసింజర్ రైలు ఛార్జీలంతే ఉంటాయి. అదే దీని ప్రత్యేకత. ఆ రైలు ఏదంటే న్యూఢిల్లీ-పాట్నా రాజేంద్రనగర్ టెర్మినల్ మధ్య నడుస్తున్న సంపూర్ణ క్రాంతి ఎక్స్ ప్రెస్. దాన్నిగురించిన వివరాలు తెలుసుకుందాం.
జయప్రకాష్ నారాయణ్ పేరు పెట్టారు
సంపూర్ణ క్రాంతి రైలును 2002 ఫిబ్రవరి 16వ తేదీన ప్రవేశపెట్టారు. దీనికి లోక్ నాయక్ జైప్రకాష్ నారాయణ్ పేరు పెట్టారు. తక్కువ ధరలో అత్యంత వేగంగా తీసుకువెళ్లే రైలుగా పేరు తెచ్చుకుంది. వాజ్ పేయి హయాంలో రైల్వేమంత్రిగా పనిచేసిన ప్రస్తుత బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ రైలును ప్రవేశపెట్టారు. బీహార్ రాష్ట్ర ప్రజలందరి మొదటి ఎంపిక ఈ రైలే. టికెట్ల బుకింగ్ అలా తెరిచారో లేదో వెంటనే వెయిటింగ్ లిస్టులోకి వెళ్లిపోతుంది. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ రైలు న్యూఢిల్లీ నుంచి పాట్నా మధ్య ఉన్న 1001 కిలోమీటర్ల దూరాన్ని 13 గంటల్లోపే చేరుకుంటుంది. న్యూఢిల్లీ నుంచి కాన్పూర్, మీర్జాపూర్, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ మీదుగా పాట్నాలోని రాజేంద్రనగర్ టెర్మినల్ చేరుకుంటుంది.

రాజధాని ఎక్స్ ప్రెస్ కు పట్టే సమయమే
ప్రజల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో హాల్టింగ్ స్టేషన్ల సంఖ్యను పెంచారు. రాజధాని ఎక్స్ ప్రెస్ కూడా న్యూఢిల్లీ నుంచి పాట్నా చేరుకోవడానికి దాదాపుగా అంతే సమయం పడుతోంది. కానీ ఛార్జీలు అధికంగా ఉంటాయి. సంపూర్ణ క్రాంతి ఎక్స్ ప్రెస్ బయలుదేరిన తర్వాత ఎక్కడా ఆలస్యం కాదు. ప్రధానమైన స్టేషన్లలో ఐదు నిముషాలు, కొన్ని స్టేషన్లలో రెండు నిముషాలు మాత్రమే ఆగుతుంది. బీహార్ ప్రజలంతా దీన్ని రాజధాని ఎక్స్ ప్రెస్, వందేభారత్, శతాబ్ది రైళ్లతో పోలుస్తారు. ఈ తరహా రైలును దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య కూడా ప్రవేశపెట్టాలని ప్రయాణికుల నుంచి డిమాండ్ వస్తోంది. అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.












Click it and Unblock the Notifications