ఎన్నికల్లో రైతుల పోటీపై సంయుక్త కిసాన్ మోర్చా, రాకేష్ టికాయత్ సంచలన ప్రకటన
ఏడాది పాటు ఢిల్లీ వేదికగా సాగిన రైతుల ఆందోళనకు సారథ్యం వహించిన సంయుక్త కిసాన్ మోర్చా తాము ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోమని పేర్కొంది. అంతేకాదు తాను ఏ రాజకీయాల్లో చేరడం లేదని, రైతు సంఘం నాయకుడు రాకేశ్ టికాయత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకపక్క పంజాబ్ ఎన్నికలలో రైతు సంఘాల నాయకులు ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకోవటం , ఇదే సమయంలో రాకేష్ టికాయత్ ఈ ప్రకటన చేయడంతో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
పంజాబ్ ఎన్నికల్లో పోటీ చెయ్యటానికి 22 రైతు సంఘాలు రెడీ
వచ్చే ఫిబ్రవరిలో జరగనున్న పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రైతు సంఘాలు కలిసి రాజకీయ ఫ్రంట్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పంజాబీ ఎన్నికల బరిలో నిలిచేందుకు 22 రైతు సంఘాలు రెడీ అయ్యాయి. రాష్ట్రంలో రాజకీయ మార్పు సాధించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయా సంఘాల ప్రతినిధులు వెల్లడించారు. మరో పక్క అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. అయితే పంజాబ్ నుండి ఆందోళన చేసిన 32 రైతు సంఘాలలో 22 రైతు సంఘాలు మాత్రమే అసెంబ్లీ ఎన్నికలలో రంగంలోకి దిగడానికి రెడీ అవుతున్నాయి.
ఎన్నికల కోసం కిసాన్ సమాజ్ మోర్చా గా కొత్త రాజకీయ వేదిక
రాష్ట్ర వ్యాప్తంగా 117 అసెంబ్లీ స్థానాలలో ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించాయి. సరికొత్త పంజాబ్ నిర్మాణానికి మరిన్ని రైతు సంఘాలు కూడా కలిసి రావాలని వారు కోరుతున్నారు. సాగు చట్టాల రద్దు కోసం ఏడాది పాటు సాగిన రైతు ఉద్యమ నేపథ్యంలో పంజాబ్ రైతులపై అంచనాలు ప్రజలకు బాగా పెరిగాయని రాష్ట్రం బాగు కోసం రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించామని రైతులు అంటున్నారు ఎన్నికల కోసం కొత్తగా సంయుక్త సమాజ్ మోర్చా అంటూ రాజకీయ వేదికను ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.
కిసాన్ సంయుక్త మోర్చా ఎన్నికలకు దూరం, రాజకీయాలలో చేరటం లేదన్న టికాయత్
ఇక ఇప్పటికే రాజకీయాలకు దూరంగా ఉండాలని, ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయబోమని, సంయుక్త కిసాన్ మోర్చా పేరును ఎవరు ఉపయోగించడానికి వీలు లేదని కిసాన్ సంయుక్త మోర్చా వెల్లడించింది. రాకేష్ టికాయత్ కూడా తను రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై తమ వైఖరి గురించి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత దానిపై మాట్లాడతామని రాకేష్ టికాయత్ వెల్లడించారు.
యూపీలో రైతులు కింగ్ మేకర్ పాత్ర ... సమావేశం తర్వాత మాట్లాడతాం
యూపీలో రైతులు కింగ్ మేకర్ పాత్ర పోషిస్తారని ఆయన అన్నారు. ఇదే సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడి కారును వేగంగా నడుపుతూ రైతులను చంపిన లఖింపూర్ ఖేరీ ఘటనలో కూడా బీజేపీ నిష్క్రియాపరత్వం వహించిందని ఆరోపించారు. పంజాబ్లో రైతు సంఘాలు రాజకీయ ఫ్రంట్ను ఏర్పాటు చేయడం గురించి విలేకరులు ప్రశ్నించగా, తాము జనవరి 15వ తేదీన సమావేశం నిర్వహిస్తున్నామని, దీని గురించి మేము మాట్లాడి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని రాకేష్ టికాయత్ పేర్కొన్నారు.
ఇక ఈ సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారు. ఎన్నికల్లో పోటీ చెయ్యాలని నిర్ణయం తీసుకున్న పంజాబ్ రైతు సంఘం నాయకులకు మద్దతు ఇస్తారా? లేదా ? అనేది తెలియాల్సి ఉంది.