ఐటీ దాడులు: మైనింగ్ కింగ్ శేఖర్ రెడ్డి డైరీలో పన్నీర్, మంత్రుల పేరు, సీబీఐతో!
చెన్నై: తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చిక్కుల్లోపడ్డారు. ఐటీ శాఖ అధికారులు త్వరలో ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను విచారణ చేసే అవకాశం ఉందని తమిళనాడులో ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆదాయానికి మించి అక్రమాస్తులు సంపాధించారని ఇసుక కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి ఇంటిలో ఐటీ శాఖ అధికారులు దాడులు చేసిన సమయంలో స్వాధీనం చేసుకున్న డైరీలో పన్నీర్ సెల్వం పేరు ఉందని తెలిసింది.
డైరీలో అందరి జాతకాలు?
టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు, ఇసుక కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డికి చెందిన డైరీలో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో సహా ఆ రాష్ట్రానికి చెందిన 7మంది మంత్రుల పేర్లు ఉన్న విషయం తాజాగా వెలుగు చూసింది.
Recommended Video
టార్గెట్ శేఖర్ రెడ్డి?
గతేడాది నవంబర్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ఱాటకలోని శేఖర్ రెడ్డి, ఆయన భాగస్వాముల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు దాడులు చేసి భారీ ఎత్తున నగదు ( రూ. 2, 000 నోట్లు), బంగారం, స్థిర, చరాస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
అన్నాడీఎంకేతో శేఖర్ రెడ్డికి లింక్!
శేఖర్ రెడ్డి ఇంటిలో అక్రమాస్తులతో పాటు ఓ డైరీని కూడా ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. అన్నాడీఎంకే ప్రభుత్వంలోని పలువురు ప్రముఖులతో శేఖర్ రెడ్డికి సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈవిషయంపై ఒక జాతీయ టీవీ చానల్ వార్తలు ప్రసారం చేసింది.
మంత్రలు వీరే
శేఖర్ రెడ్డికి చెందిన డైరీలోని కొన్ని పేజీలు మాచేతికి వచ్చాయని జాతీయ మీడియా వార్తల ప్రసారం చేసింది. జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ఆ రాష్ట్ర మంత్రులు విజయ్ భాస్కర్, తంగమణి, సంపత్, దిండుగల్ శ్రీనివాసన్, ఆర్పీ. ఉదయ్ కుమార్, ఎంఆర్, విజయ్ భాస్కర్, కేసీ కరుప్పన్నన్ల పేర్లు ఉన్నాయని జాతీయ మీడియా వార్తలు ప్రసారం చేసింది.
సీబీఐ విచారణ చెయ్యాలి!
శేఖర్ రెడ్డి డైరీ ద్వారా వెలుగుచూసిన వివరాలపై సీబీఐ విచారణ జరపాలని డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తమిళనాడు శాసన సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎంకే. స్టాలిన్ డిమాండ్ చేస్తున్నారు. వెంటనే పన్నీర్ సెల్వం, మంత్రులు రాజీనామా చెయ్యాలని ఎంకే. స్టాలిన్ డిమాండ్ చేశారు.
ఆ డైరీ నాది కాదు
తనకు డైరీ రాసే అలవాటే లేదని, తన ఇంటిలో ఐటీ శాఖ అధికారులు ఎలాంటి డైరీ స్వాధీనం చేసుకోలేదని, మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఇసుక కాంట్రాక్టర్, ప్రముఖ వ్యాపారవేత్త శేఖర్ రెడ్డి అంటున్నారు. డైరీ విషయంలో ఎలాంటి విచారణకు అయినా తాను సిద్దంగా ఉన్నానని శేఖర్ రెడ్డి చెప్పారు.
ప్రభుత్వం మౌనం
శేఖర్ రెడ్డి డైరీ విషయంలో తమిళనాడు సీఎం పళనిస్వామితో సహ ఆరోపణలు ఎదుర్కొంటున్న పన్నీర్ సెల్వం, పలువురు మంత్రులు మౌనంగా ఉన్నారు. మొత్తం మీద శేఖర్ రెడ్డి డైరీతో తమిళనాడు ప్రభుత్వం మరింత చిక్కుల్లో పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.