ప్రధాని చెప్పారు కానీ..: నవంబర్ 29న పార్లమెంటుకు రైతుల మార్చ్, నిరసనలు
న్యూఢిల్లీ: కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయనున్నట్లు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై ఆదివారం సింఘు సరిహద్దులో సంయుక్త కిసాన్ మోర్చా నేతలు సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. గతంలో నిర్ణయించిన కార్యక్రమాలు, ఆందోళనలు యథావిధిగా కొనసాగించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
నవంబర్ 22న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో కిసాన్ పంచాయత్, 26న అన్ని సరిహద్దుల్లో రైతుల సమావేశం, 29న పార్లమెంట్కు ట్రాక్టర్లలో ర్యాలీగా తరలివెళ్లటం యథావిధిగా కొనసాగుతుందని రైతు నేత బల్బీర్ సింగ్ రజెవాల్ స్పష్టం చేశారు. సాగు చట్టాల రద్దును స్వాగతిస్తున్నామని, అయితే చాలా విషయాలు పెండింగ్లో ఉన్నాయని బల్బీర్ సింగ్ అన్నారు.
పెండింగ్లో ఉన్న రైతుల డిమాండ్లపై మోడీకి బహిరంగ లేఖ రాయనున్నట్లు బల్బీర్ సింగ్ చెప్పారు. కనీస మద్దతు ధర కమిటీ, విద్యుత్తు బిల్లు 2020, రైతులపై కేసుల ఉపసంహరణ వంటి డిమాండ్లతో మోడీకి లేఖ రాయనున్నట్లు చెప్పారు. లఖింపుర్ ఖేరి హింస కేసులో భాగంగా కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయనున్నట్లు తెలిపారు.
Recommended Video
భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఈనెల 27న మరోమారు సమావేశం అవుతామని ఆయన తెలిపారు. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) చట్టం కోసం మహాపంచాయత్లో పాల్గొనేందుకు ఛలో లక్నో చేపడుతున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ ప్రతినిధి రాకేశ్ టికాయత్ తెలిపారు. వ్యవసాయ సంస్కరణలపై కేంద్రం చెప్పేవన్నీ ఉట్టి మాటలే.. వాటి వల్ల రైతుల పరిస్థితి ఏమి మారదు.. కనీస మద్దతు ధర కల్పిస్తూ చట్టం తీసుకొచ్చినప్పుడే అతిపెద్ద సంస్కరణ రైతు సంఘం నేత టికాయత్ వ్యాఖ్యానించారు.