ఎమ్మెల్యేలు శశికళ పట్టు జారిపోతున్నారా?: 'పన్నీర్ వారిని కొనేస్తున్నారు'
క్యాంపు రాజకీయాలతో పట్టు నిలుపుకోవాలని భావిస్తోన్న శశికళకు పన్నీర్ చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? శశికళ నోటి వెంట వచ్చిన వ్యాఖ్యలను వింటే.. ఇదే అభిప్రాయం కలగకమానదు.
చెన్నై: క్యాంపు రాజకీయాలతో పట్టు నిలుపుకోవాలని భావిస్తోన్న శశికళకు పన్నీర్ చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? శశికళ నోటి వెంట వచ్చిన వ్యాఖ్యలను వింటే.. ఇదే అభిప్రాయం కలగకమానదు.
ఎక్కడ తననుంచి జారిపోతారోనని తనకు మద్దతుగా వచ్చిన ఎమ్మెల్యేలందరిని శశికళ ఓ రిసార్ట్ కు తరలించిన సంగతి తెలిసిందే. గురువారం నాడు గవర్నర్ చెన్నైకి చేరేదాకా.. వారిలోంచి ఎవరిని మిస్ అవకుండా ఆమె జాగ్రత్తపడుతూ వస్తున్నారు.
అదే సమయంలో.. 40మంది ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లారంటూ వార్తలు రావడం.. అందులోంచి 22మంది ఎమ్మెల్యేలు పన్నీర్ చెంత చేరినట్టు ఊహాగానాలు వినిపస్తుండటం తెలిసింది. ఈ తరుణంలో గురువారం నాడు మీడియాతో మాట్లాడిన శశికళ దీనిపై స్పందించారు.
పన్నీర్ సెల్వం తమ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నిస్తున్నారని శశికళ ఆరోపించారు. పన్నీర్ కు కేవలం 8 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని అన్నారు. ఆయన ఎమ్మెల్యేలను డబ్బుతో కొనుగోలు చేస్తూ, నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడని విమర్శించారు. పన్నీర్ నీచ రాజకీయాలకు తెరలేపుతున్నారంటూ విమర్శించారు.
ఇదిలా ఉంటే, శశికళ చేసిన 'ఎమ్మెల్యేల కొనుగోలు' కామెంట్స్ ను బట్టి చూస్తే.. తన నుంచి ఎమ్మెల్యేలు పట్టు జారిపోతున్నారనే సంకేతాలను ఆమె పరోక్షంగా చెప్పారన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు మరోవైపు శశికళ వర్గంలో ప్రస్తుతం ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న దానిపై క్లారిటీ లేదు.
హోటళ్లు, రిసార్టుల్లో ఉన్న ఎమ్మెల్యేల్లో ఎంతమంది గవర్నర్ ముందుకు వచ్చి మద్దతు పలుకుతారన్నదానిపైనే శశికళ భవితవ్యం ఆధారపడి ఉంది.