సత్ప్రవర్తన: ముందస్తు విడుదలకు వీకే శశికళ దరఖాస్తు
బెంగళూరు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ ముందస్తు విడుదలకు దరఖాస్తు చేసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్లుగా బెంగళూరు పరప్పణ అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు శశికళ. తాజాగా, ముందస్తు విడుదలకు జైలు అధికారులకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.
ప్రత్యేక కోర్టులో తనకు విధించిన జరిమానా చెల్లించిన అనంతరం శశికళ 2021, జనవరి 27న జైలు నుంచి విడుదల కావాల్సి ఉండగా, అంతకంటే ముందుగానే జైలు నుంచి బయటకు వచ్చేందుకు ఆమె దరఖాస్తు చేసుకున్నారు. తన సత్ ప్రవర్తన కారణంగా తనను ముందుగానే విడుదల చేయాలని కోరారు. ఆమె వినతిని జైలు అధికారులు ఉన్నతాధికారులకు పంపించారు. దీనిపై వారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళతోపాటు ఆమె కుటుంబసభ్యులు ఇద్దరు 2017, ఫిబ్రవరి 15 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. వీరి ముగ్గురికి నాలుగేళ్ల సాధారణ జైలు శిక్షతోపాటు, ఒక్కొక్కరికీ రూ. 10 కోట్ల చొప్పున కోర్టు జరిమానా విధించింది.
కాగా, సాధారణంగా సత్ ప్రవర్తన కలిగిన ఖైదీలను ముందస్తు విడుదలకు అనుమతిస్తారు. అలాంటి వారికి నెలకు 3 రోజుల చొప్పున శిక్ష నుంచి మినహాయింపు ఇస్తారు. ఇక శశికళ ఇప్పటికే 43 నెలల జైలు శిక్ష అనుభవించారు. దీని ప్రకారం శశికళకు 135 రోజుల జైలు జీవితం నుంచి మినహాయింపు లభించే అవకాశం ఉంది. అందుకే ఆమె ముందస్తు విడుదలకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ శశికళ విడుదలైదే తమిళ రాజకీయాలు మరింత వేడెక్కె అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications