వింతగా శశికళ, చీలిక దిశగా పార్టీ: జయ సమాధి వద్ద 3సార్లు అందుకే కొట్టారు..
పన్నీరు సెల్వం తిరుగుబాటు, తెరపైకి పళని స్వామిని ముఖ్యమంత్రి రేసులోకి తీసుకు రావడం, బుధవారం పార్టీ పగ్గాలు టిటివి దినకరన్కు అప్పగించడం, ఆ తర్వాత జయ సమాధి వద్ద వింత ప్రవర్తన..
చెన్నై: అన్నాడీఎంకే చీలిక దిశగా కొనసాగుతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. పన్నీరు సెల్వం తిరుగుబాటు, తెరపైకి పళని స్వామిని ముఖ్యమంత్రి రేసులోకి తీసుకు రావడం, బుధవారం పార్టీ పగ్గాలు టిటివి దినకరన్కు అప్పగించడం, ఆ తర్వాత జయ సమాధి వద్ద వింత ప్రవర్తన.. చూస్తుంటే పార్టీ చీలిక దిశగానే కనిపిస్తోందని అంటున్నారు.
జయ నేతృత్వంలో..
1972లో ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకే పార్టీ ఆయన మరణించిన తర్వాత కూడా జయలలిత నేతృత్వంలో దూసుకెళ్తోంది. దివంగత జయలలిత దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు పార్టీని ఏకఛత్రాధిపత్యంగా నడిపించారు.
చీలిక దిశగా..
అలాంటి అన్నాడీఎంకే ఇప్పుడు చీలిక దిశగా అడుగులు వేస్తోంది. తనకు జైలు శిక్ష పడిన నేపథ్యంలో సీఎం అభ్యర్థిగా పళనిస్వామిని శశికళ ప్రతిపాదించడం పార్టీలో చాలామందికి నచ్చడం లేదని అంటున్నారు.
పళనిస్వామిపై ఆరోపణలు
పళనిస్వామిపై ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు, కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి వ్యక్తిని సీఎంగా చేస్తే, పార్టీ పరువు పోతుందని పలువురు ఎమ్మెల్యేలు భావిస్తున్నట్టుగా చెబుతున్నారు. అమ్మకు అత్యంత విధేయుడు, మచ్చలేని మనిషి పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అయితేనే బాగుంటుందని కొందరు భావిస్తున్నారు.
పదవులు
పార్టీ నుంచి జయలలిత వెళ్లగొట్టిన తన బంధువులకు పార్టీలో కీలక పదవులను శశికళ కట్టబెట్టడం చాలామందికి మింగుడు పడటం లేదు. పోయస్ గార్డెన్ నుంచి జయ తరిమేసిన తన మేనల్లుడు దినకరన్కు పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవిని శశికళ కట్టబెట్టారు. ఇది చాలామందికి రుచించడం లేదు.
చీలిపోవడం ఖాయమా?
అన్నాడీఎంకే నిట్టనిలువునా చీలిపోనుందనే సంకేతాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. అయితే, ఎవరెవరు, ఎవరెవరి వెంట ఉండబోతున్నారనే విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ కనిపించడం లేదు. పన్నీరు సెల్వం వర్సెస్ శశికళలను చూస్తుంటే చీలిక ఖాయమని భావిస్తున్నారు.
చిన్నమ్మ వింత ప్రవర్తన
బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకు వెళ్లే ముందు బుధవారం నాడు శశికళ చాలా వింతగా ప్రవర్తించారని అంటున్నారు. జయ బహిష్కరించిన దినకరన్కు పార్టీ పగ్గాలు అప్పగించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అంతకుముందు ఎంజీఆర్ ఫోటో వద్ద నమస్కరించి, కాసేపు ధ్యానం చేశారు. అనంతరం శశికళ సమాధి వద్ద శపథం చేశారు.
శశికళ చేసిన శపథాలు ఇవే..
అమ్మ సమాధిని దర్శించుకున్న శశికళ.. అక్కడ సమాధిపై మూడు సార్లు బలంగా కొట్టి, మూడు శపథాలు చేసిన ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఏం చెబుతూ మూడు సార్లు సమాధిపై కొట్టిందన్న విషయాన్ని ఆ సమయంలో పక్కనే ఉన్న అన్నాడీఎంకే నేతలు వివరించారు. ఎక్కడున్నా తన మనసు అమ్మ చుట్టూనే ఉంటుందని, దానిలో మార్పుండదని చెబుతూ ఆమె తొలిసారి సమాధిపై కొట్టారని ఓ నేత తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ఆశయాలను కొనసాగిస్తానని ఓసారి, పార్టీని చీల్చాలని చూసేవారిని ఎన్నటికీ క్షమించనని ఎరుపెక్కిన కళ్లతో మరోసారి ఆమె సమాధాపై కొట్టారని వెల్లడించారు.