జయలలిత వారసురాలు! అమ్మ స్టైల్లో ఎన్నికల ప్రచారం
దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ ఇప్పుడు తమిళనాడు జిల్లాలను చుట్టేస్తున్నారు. తన మెంటార్ జయలలిత ఏ స్థానంలో నిలబడితే జనం నీరాజనాలు పట్టేవారో, సరిగ్గా అదే 'కమాండింగ్' స్థానాన్ని దక్కించుకోవాలని ఆమె తహతహలాడుతున్నారు. తన సొంత పార్టీ 'ఆల్ ఇండియా పురట్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కళగం' (AIPTMMK) ద్వారా ఈసారి ఎన్నికల బరిలో నిలిచారు.
శశికళ తన ఎన్నికల ప్రచారంలో పూర్తిగా 'ప్రతీకాత్మకత' (Symbolism)పై ఆధారపడుతున్నారు. జయలలిత ధరించినట్లుగానే ఉండే చీరలు, అదే వినమ్రమైన నమస్కారం, ఆమె వాడిన నినాదాలనే శశికళ వాడుతున్నారు. "అమ్మ పాలనను మళ్లీ తీసుకొస్తాం" అనే స్లోగన్తో ఏఐఏడీఎంకే (AIADMK) కోర్ ఓటర్లలో పాత జ్ఞాపకాలను రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారు. జయలలిత వారసత్వానికి అసలైన వారసురాలు తానేనని ప్రజలకు సంకేతాలు పంపిస్తున్నారు.

దక్షిణ తమిళనాడుపై గురి.. తేవర్ వర్గాలే అస్త్రం!
శశికళ పార్టీ మొత్తం 75 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టగా, అందులో ఎక్కువ మంది దక్షిణ జిల్లాల వారే ఉన్నారు. ముఖ్యంగా మధురై, తేని, రామనాథపురం, తిరునల్వేలి వంటి ప్రాంతాల్లో బలంగా ఉన్న 'తేవర్' సామాజిక వర్గం ఓట్లను ఆకర్షించడం ఆమె ప్రధాన వ్యూహం. జయలలిత హయాంలో ఈ వర్గం ఏఐఏడీఎంకేకు వెన్నెముకగా ఉండేది. ఇప్పుడు అదే సామాజిక వర్గానికి చెందిన శశికళ, పాత నెట్వర్క్లను యాక్టివేట్ చేస్తూ తన ప్రభావాన్ని చాటుకోవాలని చూస్తున్నారు.
నిన్నటి వెనుక సీటు.. నేటి ఫ్రంట్ సీటు!
దశాబ్దాల పాటు వెలుగులోకి రాకుండా జయలలిత వెనుక ఉండి పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించిన చరిత్ర శశికళది. 2016లో అమ్మ మరణం తర్వాత ముఖ్యమంత్రి కావాలని ఆమె కలలు కన్నా, అక్రమాస్తుల కేసులో జైలు శిక్షతో సీన్ తారుమారైంది. 2021లో జైలు నుంచి విడుదలైన తర్వాత కొన్నాళ్లు మౌనంగా ఉన్న చిన్నమ్మ, ఇప్పుడు ప్రస్తుత ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి (EPS) ని లక్ష్యంగా చేసుకొని విమర్శల దాడి పెంచారు.
"నమ్మకద్రోహులకు బుద్ధి చెప్పండి"
మధురై ప్రచారంలో ఆమె మాట్లాడుతూ.. "నమ్మకద్రోహులు, చెడ్డ శక్తుల పాలన కావాలా? లేదా నిస్వార్థ నాయకుల పాలన కావాలా?" అని ప్రజలను ప్రశ్నిస్తున్నారు. జయలలిత ఏ ప్రదేశాల్లో నిలబడి ప్రసంగించేవారో, సరిగ్గా అక్కడే 300 అడుగుల దూరంలో వేదికలు ఏర్పాటు చేసుకొని ఓటర్లతో ఎమోషనల్ కనెక్ట్ ఏర్పరచుకుంటున్నారు. శశికళ రాక ఏఐఏడీఎంకే ఓట్లను చీల్చుతుందా? లేదా ఆమె నిజంగానే జయలలిత వారసత్వాన్ని అందిపుచ్చుకుంటుందా? అనేది ఫలితాల్లో తేలనుంది.
TN polls: All India Puratchi Thalaivar Makkal Munnetra Kazhagam leader VK Sasikala campaigns in Chekkanurani. pic.twitter.com/UvZCs0nI3p
— News Arena India (@NewsArenaIndia) April 7, 2026












Click it and Unblock the Notifications