డీఎంకే ఎంపీ చెంప చెల్లు: జయలలిత కుక్కలా చూశారని, ఏడ్చిన శశికళ
న్యూఢిల్లీ: డీఎంకే పార్లమెంటు సభ్యులు తిరుచ్చి శివను చెంప పైన కొట్టిన అన్నాడీఎంకే ఎంపీ శశికళ పుష్ప పైన పార్టీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ ఎంపీ పైన బాహాటంగా చేయి చేసుకోవడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆమెను పార్టీ నుంచి సోమవారం నాడు సస్పెండ్ చేశారు. ఆమె ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేశారు.
తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన అంశంపై శశికళ పుష్ప రాజ్యసభలో ఈ రోజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనను జయలలిత బాధపెట్టారని, అసలు మహిళలకు ఈ దేశంలో భద్రత ఉందా అని ప్రశ్నించారు.
ఆమె రాజ్యసభలో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు. తమిళనాడులో తనకు రక్షణ లేదని, భద్రత కల్పించాలని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్కు విన్నవించారు.
జయలలితపై మండిపడ్డ శశికళ
డిఎంకే ఎంపీ తిరుచ్చి శివను కొట్టిన శశికళ పుష్ప పార్టీ అధినేత్రి, సీఎం జయలలిత పైన భగ్గుమన్నారు. జయలలిత తనను బెదిరించారని, ఆమె నుంచి తనకు ప్రాణహానీ ఉందని ఆరోపించారు. రాజీనామా చేయాలని గత రెండు నెలలుగా తనను వేధించారని తెలిపారు.
తన ఇంటికి వెళ్లేందుకు అనుమతించకుండా పోయేస్ గార్డెన్లో తనను కుక్కలా ఉంచారని ఆరోపించారు. తనను ఆమె కొట్టారని చెప్పారు. అయితే, జయలలిత కొట్టారా అని మీడియా ప్రశ్నిస్తే.. ఆమె సమాధానం చెప్పలేదు. అన్నాడీఎంకే నుంచి బహిష్కరించినందుకు తనకు సంతోషంగా ఉందని చెప్పారు. ఇక నుంచి తాను స్వతహాగా ప్రజల కోసం పని చేస్తానని చెప్పారు.

కాగా, అన్నాడీఎంకే రాజ్యసభ ఎంపీ శశికళ పుష్ప శనివారం నాడు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఎంకే ఎంపీ తిరుచ్చి శివపై చేయి చేసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది.
డీఎంకే ఎంపీ చెంప పగులగొట్టిన సదరు మహిళా అన్నాడీఎంకే ఎంపీ దానిని సమర్థించుకుంటున్నారు. శశికళ పుష్ప (అన్నాడీఎంకే), తిరుచ్చి శివ(డీఎంకే) మధ్య సాన్నిహిత్యం ఉందని చెబుతూ, అందుకు సంబంధించిన ఫోటోలు వాట్సాప్, సోషల్ మీడియాలో వచ్చాయి.
ఈ చర్చ జరుగుతున్న సమయంలో ఈ ఇద్దరు ఎంపీలు ఢిల్లీ విమానాశ్రయంలో ముష్టియుద్ధానికి దిగడం గమనార్హం. విమానంలో చెన్నై వచ్చేందుకు ఎంపీలు తిరుచ్చి శివ, శశికళ పుష్పలు శనివారం మధ్యాహ్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణ కొట్టే వరకు వెళ్లింది. దీంతో అక్కడున్న వారు నివ్వెరపోయారు. వారిని భద్రతా సిబ్బంది విడదీశారు. దీనిపై శశికళ పుష్ప మాట్లాడుతూ.. తాను శివ చెంప పగలుగొట్టానని చెప్పారు. తమ సీఎం జయలలితతో పాటు తమ ప్రభుత్వంపై విమానాశ్రయ సెక్యూరిటీ సిబ్బంది వద్ద ఆయన అవహేళనగా మాట్లాడారని చెప్పారు. దీంతో తాను స్వరం పెంచానని, ఆ తర్వాత కొట్టానని చెప్పారు.












Click it and Unblock the Notifications