శశికళ భవిష్యత్తుపై నీలినీడలు: కేంద్ర వద్ద నాలుగు మార్గాలివే...
తమిళనాడు రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. శశికళ సిఎం పీఠం కోసం కాచుకుని కూర్చున్న ప్రస్తుత తరుణంలో కేంద్రం వద్ద మార్గాలేమిటి...
చెన్నై: అన్నాడియంకె శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన శశికళ నటరాజన్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే విషయంలో జాప్యం జరుగుతండడంతో ఉత్కంఠ నెలకొంది. ఆమె చేత గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర రావు ప్రమాణ స్వీకారం చేయిస్తారా, లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
దాంతో తమిళనాడు రాజకీయాల్లో స్తబ్దత, ఉత్కంఠ చోటు చేసుకున్నాయి. ఆస్తుల కేసులో శశికళపై సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుంది, తీర్పు వెలువడితే సంభవించే పరిణామాలు ఏమిటి అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఈ స్థితిలోనే గవర్నర్ న్యాయసలహా ఎందుకు కోరారనే సందేహం కూడా తలెత్తుతోంది.
చెన్నైకి గవర్నర్: సీఎంగా శశికళకు చాన్స్ ఇస్తారా ? లేదా ?
ముఖ్యమంత్రి పదవికి పన్నీర్ సెల్వం రాజీనామా చేశారు. కొత్త ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణ స్వీకారంపై సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ స్థితిలో కేంద్రం జోక్యం చేసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సమయంలో కేంద్రం వద్ద ప్రత్యామ్నాయాలు ఏమిటనే సంశయం తలెత్తుతుంది. కేంద్రం వద్ద నాలుగంటే నాలుగే ప్రత్నామ్నాయాలు లేదా మార్గాలున్నాయని అంటున్నారు.
గవర్నర్ న్యాయ సలహా కోరింది అందుకే...
పన్నీర్ సెల్వం వైపే కేంద్రం మొగ్గు ప్రదర్శిస్తోందనేది స్పష్టంగా తెలిసిపోతున్న విషయం. శశికళ ముఖ్యమంత్రి పదవి చేపట్టడం ప్రధాని నరేంద్ర మోడీకి ససేమిరా ఇష్టం లేదనే మాట వినిపిస్తోంది. ఈ స్థితిలో తమిళనాడులో రాజకీయ అనిశ్చితి చోటు చేసుకుంది. దీన్ని ఆసరా చేసుకుని కేంద్రం తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించవచ్చు. అందుకే గవర్నర్ అడ్వకేట్ జనరల్ సలహా కోరారనే ప్రచారం సాగుతోంది.
పన్నీరు సెల్వం వైపు కేంద్ర మొగ్గు
తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం కొనసాగేలా చూడడం రెండోది. శశికళపై ఆస్తుల కేసులో వారం రోజుల్లో తీర్పు వెలువరిస్తామని సుప్రీం కోర్టు వెల్లడించిన నేపథ్యంలో అదే సరైన మార్గమనే మాట కూడా వినిపిస్తోంది. అయితే శశికళ దాన్ని ఖాతరు చేయడం లేదు. ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలనే పట్టుదలతో పన్నీర్ సెల్వంతో రాజీనామా చేయించారు.
శశికళపై ప్రజల్లో వ్యతిరేకత
ప్రజల్లో శశికళపై వ్యతిరేకత ఉంది. అది క్రమంగా బలపడుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అది మరింతగా పెరిగితే కేంద్రం దాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవచ్చు. ప్రజల్లో శశికళపై మరింత వ్యతిరేకత పెరిగే విధంగా చూడడం.
శశికళ రాజీకి వచ్చేలా చేయడం..
శశికళ తనంత తానుగా రాజీకి వచ్చేలా చేయడం నాలుగోది. రాజీకి రాకపోతే తన రాజకీయ జీవితం కష్టాల్లో పడుతుందనే అభిప్రాయాన్ని కలిగించదడం ఈ సంకేతాలను శశికళకు కేంద్రం ఇప్పటికే పంపించిందని అంటున్నారు.. అయితే, తమిళనాడు రాజకీయాలకు సంబంధించి బంతి ఇప్పుడు గవర్నర్ కోర్టులో ఉంది. ఆయన ఏం చేస్తారనేదే ఇప్పుడు ఆసక్తిగా మారిన విషయం.