చైనా మరో బరితెగింపు: సిక్కిం వైపు కన్నేసిన డ్రాగన్: సరిహద్దుల్లో ఏకంగా మిస్సైల్ బేస్ స్టేషన్
న్యూఢిల్లీ: సరిహద్దు వివాదాలను అడ్డుగా పెట్టుకుని మరోసారి ఉద్రిక్త పరిస్థితులకు కారణమౌతోంది చైనా. కయ్యానికి కాలు దువ్వేలా కనిపిస్తోంది. లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకున్న అనంతరం.. సిక్కిం వైపు అడుగులు వేసింది. సిక్కిం సరిహద్దుల్లో ఇప్పటికే వివాదాస్పదమైన డోక్లామ్ ట్రై జంక్షన్, నకులా పాస్ సమీపంలో సరికొత్తగా మిస్సైల్ బేస్ స్టేషన్ను నిర్మించడానికి ప్రయత్నాలను సాగిస్తోంది. తాజాగా వెలువడిన శాటిలైట్ ఇమేజ్లు దీన్ని ధృవీకరిస్తున్నాయి.
Recommended Video

ఎల్ఏసీని ఖాళీ చేసిన తరువాత..
లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వెంబడి మోహరింపజేసిన తన సైన్యాన్ని చైనా ఉపసంహరించుకున్న తరువాత.. చోటు చేసుకున్న పరిణామాలు ఇవి. వాస్తవాధీన రేఖ వెంబడి గల గాల్వన్ లోయ, ఫింగర్స్ పాయింట్లను ఖాళీ చేసిన వెనక్కి వెళ్లిన చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) బలగాలు సిక్కి సరిహద్దులకు మకాం మార్చాయి. సిక్కిం సరిహద్దుల్లో ఇదివరకు ఉన్న సైనికుల సంఖ్యను చైనా ఆర్మీ అధికారులు మరింత పెంచినట్లు తెలుస్తోంది. గాల్వన్ వ్యాలీ ప్రాంతాన్ని చైనా ఖాళీ చేసినప్పటికీ..ఇంకా రెండు చోట్ల ఇంకా ఆ దేశ సైనికుల మోహరింపు కొనసాగుతోంది.
చర్చలు కొనసాగుతుండగానే..
పంగ్యాంగ్ త్సొ, డెప్సాంగ్-దౌలత్ ఓల్డీ వంటి కొన్ని చోట్ల ఇంకా పీఎల్ఏ బలగాలు వెనక్కి తగ్గాల్సి ఉంది. దీనికోసం భారత్-చైనా మధ్య ఆర్మీ పరంగా లెప్టినెంట్ కల్నల్ స్థాయి అధికారుల చర్చలు కొనసాగుతున్నాయి. వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ (డబ్ల్యూఎంసీసీ) తరచూ సమావేశాలను నిర్వహిస్తోంది. ఈ పరిణామాలతో వెనక్కి తగ్గినట్టే కనిపించిన చైనా.. తాజాగా సిక్కిం సరిహద్దు ప్రాంతాలపై కన్నేసింది. డోక్లామ్ ట్రైజంక్షన్, నకులా పాస్ సమీపంలో మిస్సైల్ బేస్ స్టేషన్ నిర్మాణానికి పూనుకుంటోంది.

క్లాష్ పాయింట్కు సమీపంలో..
భారత్తో తలెత్తిన సరిహద్దు ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతుండగానే.. సిక్కిం సరిహద్దుల్లో సరికొత్త వివాదానికి చైనా తెర తీసినట్టయింది. మిస్సైల్ బేస్ స్టేషన్ నిర్మాణానికి పీఎల్ఏ బలగాలు ప్రయత్నిస్తున్నాయి. దీనికి సంబంధించిన శాటిలైట్ ఫొటోలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. 2017లో భారత్- చైనా సైనికుల మధ్య సుమారు రెండు నెలల పాటు ఘర్షణ వాతావరణానికి కారణమైన, ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తిన డోక్లామ్ ట్రైజంక్షన్ క్లాష్ పాయింట్కు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో మిస్సైల్ బేస్ స్టేషన్ను నిర్మిస్తున్నట్లు శాటిలైట్ ఇమేజీల ద్వారా స్పష్టమౌతోంది.

సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ సైట్స్..
జియోపొలిటికల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ ఫాం స్ట్రాట్ఫర్, సిమ్టక్ సంయుక్తంగా ఈ శాటిలైట్ ఫొటోలను చిత్రీకరించాయి. దీన్ని తమ ట్విట్టర్లో పోస్ట్ చేశాయి. భూ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణులను ప్రయోగించడానికి అవసరమైన బేస్ స్టేషన్లను అభివృద్ధి చేస్తోందని వెల్లడించాయి. ముందస్తు సంకేతాలను పంపించడానికీ అవసరమైన రాడార్ వ్యవస్థను కూడా చైనా తన భూభాగంపై నిర్మిస్తోందనే విషయాన్ని బహిర్గతం చేశాయి. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా అక్కడి ఏర్పాట్లను చేపట్టిందని, విపరీతమైన చలిని తట్టుకునే సైనిక గుడారాలను నిర్మిస్తోందని తేలింది.












Click it and Unblock the Notifications