బాహుబాలి-2 కి వార్నింగా ? అజిత్ ఔట్, రేపు ప్రభాస్ ! రగులుతున్న కర్ణాటక
బెంగళూరు: కర్ణాటకలో డబ్బింగ్ సినిమాలు విడుదల చేస్తే తాము కచ్చితంగా థియేటర్లను తగలబెడుతాం, అవసరం అయితే జైలుకు వెలుతాం అని ప్రముఖ కన్నడ నటుడు, నిర్మాత జగ్గేష్ అగ్నికిఆజ్యం పోశారు. డబ్బింగ్ సినిమాలు విడుదల చేస్తే కన్నడ చిత్రపరిశ్రకు తీరనినష్టం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తమిళంలో అజిత్, అనుష్క, త్రీషా, అరుణ్ విజయ్ నటించిన 'ఎనై అరింథాల్' సినిమాను 'సత్యదేవ్ ఐపీఎస్'పేరుతో కన్నడలోకి డబ్బింగ్ చేసి శుక్రవారం కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేశారు. అయితే భయంతో బెంగళూరు నగరంలో ఒక్క థియేటర్ కూడా సత్యదేవ్ ఐపీఎస్ కు ఇవ్వలేదు. ఇదే సమయంలో కర్ణాటకలోని ప్రముఖ నగరాలు, పట్టణాల్లో సినిమా ప్రదర్శనను కన్నడ సంఘాలు అడ్డుకున్నాయి. ఈ సినిమా విడుదల చేసిన పంపిణిదారులు డబ్బులు పోయాయని నెత్తిన చేతులుపెట్టుకున్నారు.

రెచ్చిపోయిన కన్నడ సంఘాలు
సత్యదేవ్ ఐపీఎస్ సినిమా విడుదల చేసిన థియేటర్ల ముందు కన్నడ సంఘాలు ధర్నాలు చేశారు. సత్యదేవ్ ఐపీఎస్ సినిమా పోస్టర్లు, ఫ్లెక్సీలు చించివేసి నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. వెంటనే సినిమా ప్రదర్శన నిలిపివేయకుంటే మీ అంతు చూస్తామని థియేటర్ల యాజమాన్యాన్ని హెచ్చరించడంతో గతిలేక వారు సినిమా ప్రదర్శన నిలిపివేశారు.

ప్రేక్షకులు రాకపోవడంతో
మైసూరు, మంగళూరు, చిత్రదుర్గ, హుబ్బళి, మండ్య తదితర జిల్లాల్లో సినిమా విడుదలైన మొదటి రోజు థియేటర్లు ఖాళీగా దర్శనం ఇచ్చాయి. కనీసం కరెంటు బిల్లుకు కూడా డబ్బు మిగలదని గుర్తించిన థియేటర్ యాజమాన్యం సినిమా ప్రదర్శన రద్దు చేశారు. శనివారం కన్నడ సినిమాలు వేసి థియేటర్లకు ఎలాంటి హాని జరగకుండా ఊపిరిపీల్చుకున్నారు.

ముందుంది ముసళ్ల పండగ
2015లో తమిళ్ ఎనై అరింథాల్ సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమాను డబ్బింగ్ చేసి తెలుగులో విడుదల చేశారు. రెండేళ్ల తరువాత కన్నడలో డబ్బింగ్ చేసిన సత్యదేవ్ ఐపీఎస్ పేరుతో సినిమాను విడుదల చేశారు. యూట్యూబ్ లో ఈ సినిమా ట్రైలర్ విడుదల చెయ్యడంతో 1.75 లక్షల మంది సినీ ప్రేక్షకులు చూడటంతో సినిమా పంపిణిదాలు ఆనందంగా ఉన్నారు. అయితే సినిమా విడుదల అయిన తరువాత వారి ఆశలు ఆవిరి అయిపోయాయి.

మౌనంగా కన్నడ చలన చిత్ర వాణిజ్య మండలి
కన్నడ చలన చిత్ర వాణిజ్య మండలి సర్వసభ్యులు డబ్బింగ్ సినిమాల విషయంలో రెండు వర్గాలుగా చీలిపోయారు. కొందరు డబ్బింగ్ సినిమాల వలన కన్నడ చిత్రపరిశ్రమ అభివృద్ది చెందుతుందని అంటున్నారు. మరి కొందరు మాత్రం డబ్బింగ్ సినిమాల కారణంగా కన్నడ చిత్ర పరిశ్రమలో ఉన్న కార్మికులు రోడ్డునపడుతారని ఆరోపిస్తున్నారు.

బాహుబలి-2కి అప్పుడే వార్నింగ్ !
రాజమౌళి దర్శకత్వంలో ప్రబాస్, రానా, అనుష్క, తమన్న నటించిన బాహుబలి-2 సినిమా కన్నడలో డబ్బింగ్ చేసి విడుదల చెయ్యడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కన్నడ సినీరంగంతో పాటు పలుబాషల్లో సినిమాలు నిర్మించిన ఓ ప్రముఖ నిర్మాత బహుబలి-2 సినిమాను కన్నడలోకి డబ్ చేసి విడుదల చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం బాహుబలి-2 సినిమా కన్నడలో డబ్బింగ్ చేసి విడుదల చెయ్యాలని వేల సంఖ్యలో నెటిజన్లు కోరుతున్నారు. ఇదే సమయంలో కన్నడ సంఘాలు ఇలాంటి హెచ్చరికలు జారీ చెయ్యడంతో బాహుబలి-2 సినిమా కన్నడలోకి డబ్బింగ్ చేస్తారా ? లేదా ? అంటూ సినీ అభిమానులు ఆయోమయంలోపడ్డారు.

ఏకతాటిపైకి కన్నడ సంఘాలు
డబ్బింగ్ సినిమాలకు వ్యతిరేకంగా కన్నడ సంఘాలు ఏకమవుతున్నాయి. డబ్బింగ్ సినిమాలు విడుదల చేస్తే తాను కన్నడ సంఘాల కార్యకర్తలతో కలిసి థియేటర్లకు స్వయంగా నిప్పుపెడుతానని కన్నడ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు వాటల్ నాగరాజ్ హెచ్చరించారు. ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ సినిమాల హక్కుల కొనుగోలు చేసి కన్నడలో డబ్బింగ్ పూర్తి చేసి సినిమాలు విడుదల చెయ్యలకున్న పలువురు నిర్మాతలు ఆయోమయంలోపడ్డారు.












Click it and Unblock the Notifications