కరోనా మహమ్మారితో ప్రపంచాన్ని సర్వనాశనం చేసింది: చైనాపై డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: కరోనావైరస్ మహమ్మారి చైనాలోనే పుట్టిందని.. అదే చైనా వైరస్సేనని మొదటినుంచి వాదిస్తున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆ దేశంపై ధ్వజమెత్తారు. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా జరిగిన నష్టానికి చైనా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉత్తర కరోలినాలోని రిపబ్లికన్ కన్వెన్షన్ సెంటర్లో ఆయన మాట్లాడారు.
Recommended Video
ప్రపంచానికి 10 ట్రిలియన్ డాలర్లు చెల్లించాలంటూ ట్రంప్
'అమెరికా, మిగిలిన ప్రపంచానికి ఇప్పుడు సమయం వచ్చింది. వారు చైనాను పరిహారం కోరాలి. కరోనా మహమ్మారికి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా బాధ్యత స్వీకరించాలి. పరిణామాలను చైనా అనుభవించాలని ప్రపంచం మొత్తం ముక్తకంఠంతో చెప్పాలి. 10 ట్రిలియన్ డాలర్లకు తక్కువ కాకుండా పరిహారం చెల్లించాలని అన్ని దేశాలు కలిసి చైనాకు బిల్లు ఇవ్వాలి. వారు చేసిన నష్టానికి అది కూడా చాలా తక్కువ' అని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.
చైనా ఇచ్చిన అప్పులు తిరిగి చెల్లించొద్దు..
అంతేగాక, ఇప్పటికే చైనా నుంచి తీసుకున్న అప్పుల చెల్లింపును నిలిపివేయాలి. దాన్ని తొలి విడత పరిహారం చెల్లింపు భావించాలి. ప్రపంచ దేశాలు చైనాకు డబ్బులు చెల్లించకూడదు. అది చాలా దేశాలను ఆర్థికంగా సర్వనాశనం చేసింది. నష్టపోయిన దేశాలకు చైనా డబ్బు చెల్లించాలి అని డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు.
అమెరికా వైద్య నిపుణుడు ఫౌఛీపైనా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కుటుంబం చైనా కమ్యూనిస్టు పార్టీ దగ్గర మిలియన్ల కొద్ది డాలర్లు తీసుకుని అమెరికా ప్రజలకు అబద్ధాల చెప్పిందని ట్రంప్ మండిపడ్డారు. పెద్ద టెక్ కంపెనీలు, అమెరికాలోని ఫేక్ మీడియా దీని గురించి పట్టించుకోదన్నారు. ఇక డాక్టర్ ఫౌచీ వైరస్ వ్యాపిస్తున్న తొలినాళ్లలో మాస్కులు పెట్టుకోవద్దని చెప్పారని, ఆ తర్వాత మాస్కులు పెట్టుకోవాలన్నారని తెలిపారు. చివరికి ఫౌచీనే పెద్ద మాస్కర్ అయ్యారంటూ ఎద్దేవా చేశారు. వైరస్ ఎక్కడ్నుంచి వచ్చిందనే విషయంలో ఫౌచీ తన జీవితంలోనే అతిపెద్ద తప్పు చేశారంటూ తీవ్రంగా విమర్శించారు.
చైనా దారికి రావాలంటే..
చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అమెరికా తక్షణమే 100 శాతం టారీఫ్లు విధించాలని ట్రంప్ డిమాండ్ చేశారు. అప్పుడే వారి సైన్యం వెనక్కి తగ్గడంతోపాటు అమెరికా కంపెనీలు స్వదేశానికి వస్తాయన్నారు. కరోనా వ్యాప్తికి ముందు వరకు కూడా చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో తనకు మంచి సంబంధాలే ఉన్నాయని ట్రంప్ తెలిపారు. అయితే, జో బైడెన్ను చైనా పట్టించుకోదన్నారు. కాగా, చైనా వూహాన్ ల్యాబ్ నుంచి కరోనావైరస్ వ్యాప్తి జరిగిందని ఇప్పటికే పలు దేశాల శాస్త్రవేత్తలు పేర్కొన్న విషయం తెలిసిందే.