శుభవార్త: ప్రాసెసింగ్ ఫీజు లేకుండానే గృహ రుణాలు: ఎస్బీఐ
న్యూఢిల్లీ: ఎస్బిఐ ఖాతాదారులకు శుభవార్త. గృహల కొనుగోలు కోసం ఎస్బీఐ నుండి రుణాలు తీసుకొనేవారికి ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఒక్క పైసా ప్రాసెసింగ్ ఫీజు లేకుండానే గృహల రుణాలను మంజూరు చేయనున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది.
ప్రభుత్వ బ్యాంకింగ్ సెక్టార్లో ఎస్బీఐ అతి పెద్ద బ్యాంకు. ఈ బ్యాంకు నుండి గృహ రుణాలను తీసుకొనే వారికి ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండానే ఈ రుణాలను మంజూరు చేస్తామని ఎస్భీఐ ప్రకటించింది. అయితే ఈ అవకాశం మార్చి 31వరకు మాత్రమేనని ఎస్బీఐ ప్రకటించింది.
కేవలం ఒక్క రోజు వ్యవధి మాత్రమే ఉంది. ఒక్క రోజులో బ్యాంకు రుణాలు తీసుకొనేవారికి ఈ అవకాశం దక్కనుంది. ఇతర బ్యాంకుల్లో రుణాలు తీసుకొని ఎస్బీఐ బ్యాంకుకు మారిన వారికి కూడ ఈ అవకాశం వర్తించనుందని ఎస్బీఐ ప్రకటించింది.
మార్చి 31వ తేదితో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుంది. దీంతో ఖాతాదారులను ఆకర్షించేందుకుగాను ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకొందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ అవకాశం ఒక్క రోజుకే పరిమితమైంది.
మరోవైపు ఇప్పటివరకు ఎస్బీఐ అనుబంధ బ్యాంకుకు చెందిన చెక్బుక్లు మార్చి 31వరకు పని చేస్తాయని ఎస్బీఐ ప్రకటించింది. అయితే ఆ గడువు కూడ సమీపించింది. దీంతో మార్చి 31 తర్వాత కొత్త చెక్ బుక్లను తీసుకోవాలని ఎస్బీఐ ప్రకటించింది. ఏప్రిల్ నుండి కొత్త చెక్లను మాత్రమే అనుమతించనున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది.
ఈ మేరకు ఎస్బీఐ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఏప్రిల్ నుండి ఎస్బీఐ ఖాతాల్లో కనీస నగదు నిల్వలను చేయకపోతే విధించే ఛార్జీలను భారీగా తగ్గించింది. పట్టణాల్లో నెలకు రూ. 15, గ్రామీణ ప్రాంతాల ఖాతాదారులపై రూ.10 జరిమానాను విధించనున్నారు.