మూడు వారాల్లో కరోనా పీక్ - లాక్ డౌనే మార్గమా : ఎస్బీఐ తాజా సర్వే కలకలం..!!
కరోనా థర్డ్ వేవ్ దేశాన్ని కుదిపేస్తోంది. నిత్యం రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచ దేశాలు కరోనా థర్డ్ వేవ్ దెబ్బకు విలవిల్లాడుతున్నాయి. ఇదే సమయంలో ఒమిక్రాన్ మరింత ఆందోళన పెంచుతోంది. ఇక, ఈ నెలాఖరు నుంచి ఫిబ్రవరి మూడో వారం వరకు కరోనా కేసులు పీక్ కు చేరుతాయంటూ ఇప్పటికే అనేక పరిశోధన సంస్థలు హెచ్చరిస్తూ వచ్చాయి. ఇప్పుడు, కరోనా థర్డ్ వేవ్ వ్యాప్తి మూడు వారాల్లో గరిష్ఠ స్థాయికి చేరుతుందని ఎస్బీఐ రీసెర్చ్ తాజాగా అంచనా వేసింది. సిటీల్లో ప్రారంభమై ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించింది.
మూడు వారాల్లో పీక్ స్టేజ్ కు
అయితే, ఈ తీవ్రత ఎక్కువ కాలం ఉండకపోవచ్చని, వచ్చే మూడు వారాల్లో కేసుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చంటూ ఎస్బీఐ అంచనా వేస్తోంది. థర్డ్ వేవ్ ప్రారంభమైన తరువాత ఈ నెల 7వ తేదీన ముంబాయిలో 20,971 కొత్త కేసులు ఒకే రోజున గుర్తించారు. ఈ సర్వే నివేదికలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. కొవిడ్ కేసులు అమెరికాలో ప్రస్తుతం అత్యధిక సంఖ్యలో నమోదవుతున్నాయి.
యూఏఈ, చిలీ, సింగపూర్, చైనా తదితర దేశాలు 80 శాతానికి పైగా జనాభాకు టీకాలు వేశాయి. అందువల్ల కొత్త కేసులు పెరుగుతున్నా మరణాల సంఖ్య తక్కువగా ఉంది.దక్షిణాఫ్రికా, యూఎస్ఏ, బ్రెజిల్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో ఇప్పటికే కొవిడ్ మూడో విడత గరిష్ఠ స్థాయి నమోదైంది.
ఎస్బీఐ నివేదికలో కీలక అంశాలు
అక్కడి నుంచి కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఈ దేశాల్లో గరిష్ఠ స్థాయి నమోదు కావడానికి సగటున 54 రోజుల సమయం పట్టిందని విశ్లేషించారు. గత నెల డిసెంబర్ 29 నుంచి భారత్ లో తిరిగి కరోనా కేసుల తీవ్రత మొదలైంది. ఈ నెల 17వ తేదీకి వచ్చేసరికి రోజువారి కేసుల సంఖ్య 2.38 లక్షలకు చేరింది.. ఈ లెక్కన మూడు వారాల్లో కోవిడ్ గరిష్ఠస్థాయిని తాకుతుందని ఎస్బీఐ విశ్లేషించింది.
దేశంలో 64 శాతం ప్రజలకు ఇప్పటికే రెండో డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేశారు.. మరోవైపు.. ప్రజలు పెద్ద ఎత్తున కోవిడ్ బారినపడినా.. ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్యమాత్రం తగ్గుతుంది.. దీనికి వ్యాక్సినేషనే కారణమని తేల్చింది. ఇప్పుడు ఆసుపత్రుల మీద ఒత్తిడి లేదని నివేదిక స్పష్టం చేసింది. ముంబయిలో కొవిడ్ కేసులు 30-39 ఏళ్ల వయస్సు వారిలో అధికంగా బయటపడుతున్నాయి.
Recommended Video
వ్యాక్సినేషన్ తోనే మరణాల నియంత్రణ
కానీ ఈ వ్యాధితో మరణిస్తున్న వారి వయస్సు 60- 69 ఏళ్ల మధ్య ఉంటోందని నివేదికలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, బిహార్, జమ్మూ కశ్మీర్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో కేసుల సంఖ్య అధికంగా ఉంటుందంటూ గణాంకాలతో సహా వివరించారు. దీంతో..తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతండటంతో... ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా స్థాయి ఆస్పత్రుల వరకు ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.
కరోనా గుర్తించిన వారికి ఏ విధంగా చికిత్స అందించాలో ఐసీఎంఆర్.. కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా తెలుగు రాష్ట్రాలు చికిత్స అందిస్తున్నాయి. అందరూ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ.. వ్యాక్సినేషన్ తీసుకోవాలని అవగాహన పెంచుతున్నాయి.