విలీనం: 47% కార్యాలయాల మూసివేతకు ఎస్ బి ఐ నిర్ణయం
విలీన ప్రక్రియ ముగిసిన తర్వాత ఎస్ బి ఐ తన అనుబంధ బ్యాంకుల సగం కార్యాలయాలను మూసివేయాలని నిర్ణయించింది. ఇందులో మూడు ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి.
న్యూఢిల్లీ:విలీన ప్రక్రియ ముగిసిన తర్వాత ఎస్ బి ఐ తన అనుబంధ బ్యాంకుల సగం కార్యాలయాలను మూసివేయాలని నిర్ణయించింది. ఇందులో మూడు ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి.
ప్రపంచంలో అతి పెద్ద బ్యాంకుల్లో ఒకటిగా వెలుగొందేందుకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా విలీన ప్రక్రియ చేపట్టింది. విలీన ప్రక్రియ త్వరలోనే ముగియనుంది. విలీనం తర్వాత తన అనుబంధ బ్యాంకుల సగం కార్యాలయాలను మూసివేయాలని నిర్ణయించింది ఎస్ బి ఐ.
మూడు ప్రధాన కార్యాలయాలను కూడ మూసివేయాలని ఎస్ బి ఐ నిర్ణయం తీసుకొంది. ఈ ఏడాది ఏప్రిల్ 24వ, తేది నుండి ఈ కార్యాలయాలను మూసివేయనుంది ఎస్ బి ఐ.
అనుబంధ బ్యాంకుల ఐదు ప్రధాన కార్యాలయాల్లో కేవలం రెండింటిని మాత్రమే కొనసాగించనున్నారు. అనుబంధ బ్యాంకులకు సంబంధించి 27 జోనల్ ఆపీసులు, 81 రీజినల్ ఆఫీసులు 11 నెట్ వర్క్ ఆఫీసులతో పాటు మూడు ప్రధాన కార్యాలయాలను మూసివేస్తామని ఎస్ బి ఐ మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ కుమార్ ఖరా చెప్పారు.
ఏప్రిల్ 24వ, తేది వరకే ప్రస్తుత నమూనాను ఉంచుతామని, అనంతరం అనుబంధ బ్యాంకుల కంట్రోలింగ్ ఆపీసులను రీజినల్ ఆఫీసులను , జోనల్ ఆఫీసులను నెట్ వర్క్ ఆఫీసులను తగ్గించే ప్రక్రియను ప్రారంభిస్తామని ఎస్ బి ఐ ప్రకటించింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్ కోర్, స్టేబ్ బ్యాంక్ ఆఫ్ పాటియాల, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైద్రాబాద్ లను విలీనం చేసుకొంది.సోమవారం నాడు భారతీయ మహిళా బ్యాంకు ఎస్ బి ఐ లో విలీనమైంది.
ఈ విలీనంతో రూ.40 లక్షల కోట్ల ఆస్తులను ఈ బ్యాంకు సంపాదించుకోనుంది. ప్రస్తుతం 550 ఎస్ బి ఐ ఆఫీసులు అనుబంధ బ్యాంకులు, 259 ఆఫీసులు కలిగి ఉన్నాయి. విలీనం తర్వాత 687 ఆఫీసులనే కంట్రోలింగ్ ఆఫీసులుగా పరిమితం చేయాలని నిర్ధేశించుకొన్నామని ఖరా చెప్పారు. ఈ ప్రభావం 1107 ఉద్యోగులపై పడనుందని ఎస్ బి ఐ అంచనా వేస్తోంది.కస్టమర్ ఇంటర్ ఫేస్ ఆపరేషన్స్ లో వారిని నియమిస్తామని ఖరా చెప్పారు.