మైనర్ భార్యతో సెక్స్! నేరమా? కాదా?: కేంద్రానికి సుప్రీం
మైనర్ భార్యలతో సెక్స్ నేరమా? కాదా? అనే విషయాన్ని పరిశీలించి తమకు తెలుపాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని గురువారం ఆదేశించింది.
న్యూఢిల్లీ: మైనర్ భార్యలతో సెక్స్ నేరమా? కాదా? అనే విషయాన్ని పరిశీలించి తమకు తెలుపాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని గురువారం ఆదేశించింది. నోబెల్ గ్రహీత, 'బచ్పన్ బచావ్' స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు కైలాశ్ సత్యార్థి వేసిన ప్రజాహిత వ్యాజ్యంతో సుప్రీంకోర్టు ఈ మేరకు స్పందించింది.
మైనర్(15-18ఏళ్ల మధ్య వయస్సు భార్యతో సెక్స్ నేరం కాదని ఐపీసీ 375 సెక్షన్ చెబుతోంది. అయితే, పద్దెనిమిదేళ్లలోపు బాలికతో బలవంతపు సెక్స్... పదేళ్ల వరకు శిక్ష పడేంతటి తీవ్రమైన నేరమని 'లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ(పోక్సో) చట్టం' చెబుతోంది. రెండింటి మధ్య వైరుధ్యం ఉందని, దాన్ని సరిదిద్దాలని కోరుతూ కైలాశ్ సత్యార్థి వేసిన ప్రజాహిత వ్యాజ్యంతో సుప్రీంకోర్టు ఏకీభవించింది.
ఈ అంశాన్ని కేంద్రం పరిశీలించి 4 నెలల్లో తన వాదనను సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహార్, జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ చంద్రచూడ్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది.

ఇది ఇలా ఉండగా, ఇద్దరు మేజర్లు తదనంతర పరిణామాలపై పూర్తి అవగాహన ఉండి ఇష్టపూర్వకంగా లైంగిక సంబంధం పెట్టుకుంటే అత్యాచారం కిందకు రాదని బాంబే హైకోర్టు తేల్చిచెప్పింది. వివాహానికి నిరాకరించిన మాజీ ప్రియుడిపై మహిళా ప్రొఫెసర్ పెట్టిన రేప్ కేసును కొట్టేసింది. అయితే, మోసం, బెదిరింపు, దాడి కేసులను కొనసాగించేందుకు అంగీకరించింది.
నేరాభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయొచ్చా?
తీవ్ర నేరాభియోగాలపై విచారణ ఎదుర్కొంటున్న వారిని పోటీ చేయడానికి అనుమతించాలా వద్దా? విచారణ ఏ దశలో ఉండగా చట్టసభ సభ్యులపై అనర్హత వేటు వేయాలి? తదితర ప్రశ్నలపై అభిప్రాయాలు స్పష్టం చేసేందుకు సుప్రీంకోర్టు త్వరలో ఐదుగురు సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనుంది.
'వచ్చే ఎన్నికల నాటికి ప్రజలకు సంబంధిత చట్టంపై అవగాహన కలిగేలా ఈ అంశాన్ని మేము వివరించాలి' అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె.ఎస్.ఖేహర్ నేతృత్వంలోని న్యాయమూర్తులు జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ డి.వై.చంద్రచూడ్తో కూడిన ధర్మాసనం పేర్కొంది.
తీవ్ర నేరాభియోగాలతో విచారణ ఎదుర్కొంటున్న పలువురు త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని, అందువల్ల ఐదుగురు సభ్యుల ధర్మాసనాన్ని వేసి, ఈ అంశాన్ని అత్యవసరంగా విచారించాలని బిజెపి నేత అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ తాజాగా దాఖలు చేసిన ప్రజాప్రయోజనవ్యాజ్యాన్ని పరిశీలించిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications