నీట్ పరీక్షలపై మోడీ సర్కార్కు సుప్రీంకోర్టు ఎన్నో ప్రశ్నలు: ఈడబ్ల్యూఎస్ కోటా ఫిక్స్పై సందేహాలు
న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ 2021పై దేశ అత్యున్నత న్యాయస్థానం.. కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలను సంధించింది. వాటన్నింటికీ సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన అఫిడవిట్ను సమర్పించాలని సూచించింది. ప్రత్యేకించి- నీట్ పరీక్షను రాయదలచుకున్న అభ్యర్థుల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వార్షిక ఆదాయాన్ని ఎనిమిది లక్షల రూపాయలుగా కేంద్ర ప్రభుత్వం నిర్ధారించడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. అఖిల భారత కోటా కింద ఎనిమిది లక్షల రూపాయలను వార్షిక ఆదాయంగా చూపించడంపై పలు అనుమానాలను లేవనెత్తింది.
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోటా కింద ఎనిమిది లక్షల రూపాయలను వార్షిక ఆదాయంగా చూపించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలువురు పిటీషన్లు దాఖలు చేశారు. దీన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ నిర్వహించింది. దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల్లో.. వేర్వేరు ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారు ఉంటారని, వారందరి ఆదాయం ఎనిమిది లక్షల రూపాయలుగా ఎలా నిర్ధారించారని ధర్మాసనం ప్రశ్నించింది.
ఒక్కో రాష్ట్రాల్లో ఒక్కో రకంగా ఈడబ్ల్యూఎస్ వర్గాల ఆదాయం ఉంటుందని అభిప్రాయపడింది. కోట్లాదిమంది అభ్యర్థుల ప్రయోజనాలకు ఉద్దేశించిన ఈ ఈడబ్ల్యూఎస్ కోటా పరిధిలోకి వచ్చే నీట్ అభ్యర్థుల వార్షిక ఆదాయాన్ని ఎనిమిది లక్షల రూపాయలుగా నిర్ధారించడం సహేతుకంగా లేదని జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. కేంద్రం వద్ద ఉన్న ఆధారాలేమిటీ? ఏ ప్రాతిపదికన దీన్ని నిర్ధారించారు? దీనికి ఉన్న సమగ్ర డేటా ఏమిటీ? అంటూ కేంద్రంపై ప్రశ్నల పరంపరను సంధించారు.
రాష్ట్రాల జీడీపీ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని.. ఈడబ్ల్యూఎస్ కోటా అభ్యర్థుల వార్షిక ఆదాయాన్ని నిర్ధారించారా? అని ఆయన ప్రశ్నించారు. మెట్రో నగరాల్లో నివసించే వారిని, మారుమూల గ్రామాలకు చెందిన ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వార్షిక ఆదాయం ఒకేరకంగా ఉంటుందా? అంటూ డీవై చంద్రచూడ్ కేంద్రాన్ని నిలదీశారు. ముంబై, బెంగళూరు వంటి మహా నగరాల్లో నివసించే ఈడబ్ల్యూఎస్ కుటుంబాలతో సమానంగా ఎక్కడో బుందెల్ఖండ్ వంటి మారుమూల ప్రాంతాల్లో నివసించే వారి వార్షిక ఆదాయం ఉంటుందా? అని పేర్కొన్నారు.
Recommended Video
ఎంబీబీఎస్లో 15 శాతం సీట్లు, ఎంఎస్, ఎండీల్లో 50 శాతం కోటాను అఖిల భారత ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కోసం కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన కుటుంబాలను గుర్తించడానికి ఎనిమిది లక్షల రూపాయల మొత్తాన్ని వార్షిక ఆదాయంగా పరిగణించినట్లు ప్రకటించింది. అన్ని రాష్ట్రాలు, ప్రాంతాలకు చెందిన ఈడబ్ల్యూఎస్ కుటుంబాల వారికి ఇదే మొత్తాన్ని నిర్ధారించడాన్ని సవాల్ చేస్తూ పలు పిటీషన్లు దాఖలయ్యాయి. దీనిపై తాజాగా సుప్రీంకోర్టు కేంద్రానికి ప్రశ్నలను సంధించింది. సమాధానాలను కోరింది.